CM Jagan Tributes to Pingali Venkaiah: జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పింగళి వెంకయ్యకు నివాళులు అర్పించారు. తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని ట్విట్టర్లో జగన్ పేర్కొన్నారు. కాగా ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం జగన్ ప్రారంభించారు.
దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా. pic.twitter.com/tcYgSK5Ep3
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2022
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా బాపు మ్యూజియం వద్ద జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ జయంతి మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ జయంతి నిర్వహణ ఆనందంగా ఉందన్నారు. బాపు మ్యూజియంలో పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా గురించి గాంధీకి వివరించారని గుర్తుచేశారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన ఘనత పింగళి వెంకయ్యదే అన్నారు. పత్తి, భూగర్భ ఖనిజాల గురించి అనేక పరిశోధనలు పింగళి చేశారని.. వైఎస్ఆర్ స్ఫూర్తితో బాపు మ్యూజియం ప్రాంగణంలో పింగళి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మల్లాది విష్ణు తెలియజేశారు.
