YS Jagan: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఏ ఒక్క వర్గం కూడా ప్రభుత్వ పాలనతో సంతోషంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనిపించకుండా చేసేందుకు పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించే అవకాశం ఉందని ఆరోపించిన జగన్.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొని పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తమ పార్టీకి ప్రజల్లో అత్యంత ఆదరణ ఉందని జగన్ పేర్కొన్నారు. అందువల్ల రాబోయే ఎన్నికల్లో వైసీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలకు సూచించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా దిగజారిందని వైఎస్ జగన్ విమర్శించారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. గంజాయి రవాణా చేస్తూ పోలీసులు పట్టుబడే స్థాయికి రాష్ట్ర వ్యవస్థలు దిగజారాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇక, రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక హత్య ఘటనను కూడా జగన్ ప్రస్తావించారు. ఆమెను కారుతో పదేపదే ఢీకొట్టి దారుణంగా హత్య చేశారని, అయినప్పటికీ ఆ ఘటన బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీసులు, అధికార పార్టీకి చెందిన వారు కుమ్మక్కై వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
మరోవైపు.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జగన్.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదానినీ పూర్తిగా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ఏ వర్గం కూడా ప్రభుత్వ పాలనతో సంతోషంగా లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వైసీపీపై ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోందని జగన్ పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రస్తుత కూటమి పాలనతో ప్రజలు పోల్చి చూస్తున్నారని, ఈ అంశంపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని అన్నారు.మరో ఏడాదిలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ తెలిపారు. ఆ తర్వాత ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయని పేర్కొంటూ.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తూ, స్థానిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..

