Children Sale in WhatsApp: రూ.4 లక్షలకు పసికందు..! వాట్సాప్ ద్వారా చిన్నారుల విక్రయం..

  • సోషల్‌ మీడియాలో గుట్టుగా చిన్నారులకు విక్రయాలు..!
  • వాట్సాప్ ద్వారా ముక్కుపచ్చలారని చిన్నారుల అమ్మకం..!
  • తాడేపల్లి నులకపేటలో ఓ వ్యక్తికి వాట్సాప్ లో ఆఫర్ పెట్టిన కిలాడీ లేడీ..
Children Sale

Children Sale

Children Sale in WhatsApp: సోషల్‌ మీడియాలో గుట్టుగా చిన్నారులకు విక్రయాలు సాగిస్తోంది ఓ కిలాడీ మహిళ.. వాట్సాప్ ద్వారా ముక్కుపచ్చలారని చిన్నారులను అమ్మకానికి పెడుతోంది.. తాడేపల్లి నులకపేటలో ఓ వ్యక్తికి వాట్సాప్ లో కిలాడీ మహిళ ఆఫర్‌ పెట్టడంతో.. ఈ ఘటన వెలుగు చూసింది.. సంతానం లేని.. కుటుంబాన్ని పోషించలేని దంపతులు టార్గెట్ గా సోషల్ మీడియా ద్వారా పసికందుల ఫొటోలు పంపి చిన్నారుల అమ్మకాలు, కొనుగోలు గుట్టుగా సాగిస్తోందట.. తాడేపల్లి నులకపేటలో గతం సంవత్సరం వరకు నివసించిన సామ్రాజ్యం అనే మహిళ స్థానికంగా చీరలు, వస్త్రాల వ్యాపారం పేరుతో స్థానికంగా ఉండే మహిళలను పరిచయం చేసుకుంది.. గతంలో ఓ వ్యక్తితో నులకపేటలో సహజీవనం చేస్తూ ఇదే ప్రాంతంలో తాము భార్యాభర్తలుగా స్థానికులను నమ్మించింది.. ఈ నేపథ్యంలో కొంతమంది సంతానం లేని దంపతులకు, కుటుంబ పోషణ సరిగాలేని వారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోన్ నెంబర్లను తీసుకొని చిన్నారుల, పసికందుల ఫొటోలు వాట్సాప్ ద్వారా పంపిస్తూ నాలుగు, ఐదు లక్షల రూపాయలకు చిన్నారులను అమ్మడానికి తన వద్ద అందుబాటులో ఉన్నారని అవసరమైన వారు ఎవరైనా ఉంటే తనకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.

Read Also: Kolkata incident : నాకు కూతురు, మనవరాలున్నారు.. ఏం జరిగినా చూస్తారా.. సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎంపీ

అయితే, గతంలో సదరు మహిళ కుటుంబ వివాదాల్లో, వివిధ కేసుల వ్యవహారాల్లో తాడేపల్లి పీఎస్‌లో తిరుగుతూ తనకు పోలీస్ అధికారులు, సిబ్బందితో సత్సంబంధాలు ఉన్నాయని స్థానికులను మభ్యపెడుతూ వచ్చింది.. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మోసాలను కొనసాగిస్తూ.. తనకు బలమైన అండ ఉండాలని దుర్బుద్ధితో గతంలో పదేళ్ల పాటు సహజీవనం చేసిన వ్యక్తిని సైతం వదిలేసి.. మ్యాట్రిమోనీ సైట్ ద్వారా ఓ సైనిక ఉద్యోగిని కొద్ది నెలల క్రితం వివాహం చేసుకుని హైదారాబాద్‌కు మకాం మార్చింది.. అయితే, దేశాన్ని రక్షించాల్సిన సైనిక ఉద్యోగి.. తన భార్య చేస్తున్న నేరాలను ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి కూత వేటు దూరంలో సామాన్య మహిళలను టార్గెట్ చేస్తూ కిలాడీలు గుట్టుగా సాగిస్తున్న నేరవృత్తిని అరికట్టడంలో పోలీస్ శాఖ వైఫల్యం స్పష్టంగా కనబడుతోందనే విమర్శలు ఉన్నాయి.. సదరు నేరాలపై సమగ్రమైన విచారణ జరిపి కిలాడీల ఆట కట్టించాలంటున్నారు ప్రజలు.. ఇక, చిన్నారులకు సోషల్‌ మీడియా వేదికగా అమ్మకానికి పెట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది.