AP High Court: విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచకుండా వదిలేయడం వివక్షపూరిత చర్యగా కనిపిస్తోందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. “మనది ప్రజాస్వామ్య దేశం, నియంతృత్వ దేశం కాదు” అంటూ అధికారులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎంవోలో కొందరు అధికారులు నిర్ణయాలు తీసుకుంటే సరిపోదని, అన్ని శాఖలు రాజ్యాంగ పరిమితుల్లోనే పనిచేయాలని సూచించింది.
విశ్వవిద్యాలయాల్లో కేవలం బీసీలు, రిజిస్ట్రార్లు నియమిస్తే సరిపోతుందా? బోధనా సిబ్బంది అవసరం లేదా? విద్యార్థులు నాణ్యమైన విద్య ఎలా పొందగలరు? అంటూ కోర్టు ప్రశ్నించింది. వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు బోధనా సిబ్బందిని నియమించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేలు పొందుతున్న బోధనా సిబ్బంది పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచింది. అయితే వ్యవసాయ శాఖ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనా సిబ్బందికి ఈ పెంపు వర్తింపజేయలేదు. దీంతో Sri Venkateswara Veterinary University, Andhra Pradesh Fisheries University, Acharya N. G. Ranga Agricultural Universityలకు చెందిన అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు.
ముందుగా సింగిల్ జడ్జి పిటిషన్ను కొట్టివేయగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ ప్రొఫెసర్లు, శాఖాధిపతులు డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఇక, జస్టిస్ దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ చర్యలు ప్రాథమికంగా వివక్షపూరితంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య విశ్వవిద్యాలయాల్లో యూజీసీ స్కేలు పొందుతున్న బోధనా సిబ్బందిని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అలాగే, మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేసి తమ వైఖరిని వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది హక్కులు, సమానత్వ సూత్రం, మరియు విద్యా వ్యవస్థ నాణ్యతపై ప్రభావం చూపే అంశంగా మారింది.
