AP Education Department: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు బదులుగా టీచర్ పోస్టుల సర్దుబాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ప్రస్తుతం 13 జిల్లాల ఆధారంగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలను 26 జిల్లాల ప్రకారం సర్దుబాటు చేయాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టింది విద్యాశాఖ.. ఈ ఏడాది సాధారణ ఉపాధ్యాయుల బదిలీలు ఉండే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియ చేపట్టకుండా కేవలం పోస్టుల సర్దుబాటుపైనే దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలుస్తోంది..
Read Also: AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
సర్దుబాటు ప్రక్రియలో స్పౌజ్ కేసులు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు, దివ్యాంగులు, వితంతువులు, అనారోగ్య సమస్యలు ఉన్న ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉన్న వారికి ముందుగా అవకాశం కల్పించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాత జోనల్, ప్రస్తుత జోనల్ విధానాల ప్రకారం సీనియారిటీ, రిజర్వేషన్లు మరియు ఇతర ప్రమాణాల ఆధారంగా ఉపాధ్యాయులకు తమ సొంత జోన్కు వెళ్లే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా జోన్ల ప్రకారం ఉన్న ఉపాధ్యాయులకు తమ సొంత జిల్లా లేదా జోన్లో పనిచేసే అవకాశం ఇవ్వాలని పరిశీలిస్తున్నారు.
ఇప్పటికే 26 జిల్లాలకు నోడల్ అధికారులను విద్యాశాఖ నియమించింది. ఈ అధికారులు సాధారణ పరిపాలన శాఖ (GAD), ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోస్టులు, సిబ్బంది వివరాలు, ఖాళీలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఉపాధ్యాయుల అవసరాలు, విద్యార్థుల నిష్పత్తి, పాఠశాలల అవసరాల ఆధారంగా సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది సమస్య కొంతవరకు పరిష్కారం కానుంది.
