AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..

Ap Govt

Ap Govt

AP DSC 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త చెప్పింది. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా కీలక ప్రకటన చేశారు. వచ్చే అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన కమిషనర్ తమీమ్ అన్సారియా, మెగా డీఎస్సీ-2025 ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పారదర్శకంగా నియామక ప్రక్రియ నిర్వహించినప్పటికీ, గత కొన్ని నెలలుగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు, దుష్ప్రచారం కొనసాగుతున్నాయని అన్నారు.

హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లపై ఇప్పటికే ఉన్నతాధికారులు సమగ్ర వివరణ ఇచ్చారని, అయినప్పటికీ సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులను అవమానించేలా పోస్టులు చేయడం సరికాదని, వారిని చూసి పాఠశాల విద్యాశాఖ గర్వపడుతోందని పేర్కొన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు శాఖ అండగా ఉంటుందని స్పష్టం చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మకుండా, తమ లక్ష్యంపై దృష్టి పెట్టి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలై, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా.. ఇక స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయ నియామకాలపై ఏపీ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ & ఎండీ భరణి మాట్లాడుతూ, అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్లు, ఫెడరేషన్ల నుంచి పూర్తి వివరాలు సేకరించి, ప్రతి అభ్యర్థి సర్టిఫికెట్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రిలిమినరీ ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేసి విద్యాశాఖకు పంపినట్లు తెలిపారు.