Srinivasa Rao: 2026-27 రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర విమర్శలు గుప్పించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ బడ్జెట్ రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి తోడ్పడేలా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పిన “వికసిత ఆంధ్రప్రదేశ్” నినాదం మాటల్లో గొప్పగా ఉన్నప్పటికీ, అమలులో శూన్యంగా ఉందని విమర్శించారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ఆదాయం క్రమంగా పడిపోతుందని, అభివృద్ధి జరిగితే ఆదాయం పెరగాలని అన్నారు. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం తగ్గడం ప్రజల ఆదాయాలు పడిపోతున్న సంకేతమని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, జీఎస్టీ పన్నుల వాటా తగ్గిందని తెలిపారు.
బడ్జెట్లో 98 వేల కోట్లు పెట్టుబడి వ్యయం చూపించగా, అందులో 76 వేల కోట్లు మార్కెట్ అప్పులేనని విమర్శించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 36% అప్పులేనని, బడ్జెట్లో 18% వడ్డీలకే వెళ్తోందని అన్నారు. ఈ భారం మొత్తం ప్రజలపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు వి. శ్రీనివాసరావు.. ఇక, వ్యవసాయ రంగానికి కేవలం 4% మాత్రమే కేటాయించడం రైతులకు అన్యాయం అని అన్నారు. ధరల స్థిరీకరణకు 3 వేల కోట్లు అవసరం కాగా, కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. పంటల బీమాను రైతులకు ఉపయోగకరంగా మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. వెలిగొండ, హంద్రీనీవా, వంశధార వంటి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించలేదని, ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో స్పష్టత లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి శాతంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విద్యారంగానికి కేటాయింపులు 10.8 శాతం నుంచి 10.5 శాతానికి తగ్గాయని, ఇప్పటికే 1700 పాఠశాలలు మూసివేశారని విమర్శించారు శ్రీనివాసరావు. సంక్షేమ రంగానికి కూడా కేటాయింపులు తగ్గాయని అన్నారు. మొత్తం మీద ఈ బడ్జెట్ తిరోగమన దిశలో ఉందని, ప్రజలపై అదనపు భారం మోపే ప్రమాదం ఉందని వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే కీలక రంగాల్లో కోతలు విధించడం నిరాశ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
