Flight: ఫ్లైట్‌లో మహిళకు పురిటినొప్పులు.. డెలివరీ చేసిన పైలట్‌

Jet

Jet

గగనతలంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. విమానం (Flight) ఆకాశంలో ఉండగా ఓ మహిళకు పురిటినొప్పులు మొదలయ్యాయి. పురుడుపోయడానికి డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. దీంతో పైలట్ తెగించి ఆమెకు పురిడిపోయడానికి ముందుకొచ్చాడు. మొత్తానికి ఆమెకు సహాయం చేసి విజయవంతంగా పురుడుపోశాడు. తల్లి, బిడ్డలిద్దరూ క్షేమంగా (Deliver Baby) ఉన్నారు. ఈ అనూహ్య ఘటన తైవాన్‌ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరిన వీట్‌జెట్‌కు చెందిన విమానంలో చోటు చేసుకుంది.

విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్‌రూంలో ఆమెను చూసిన సిబ్బంది విషయాన్ని పైలట్‌ జాకరిన్‌కు తెలియజేశారు. ల్యాండింగ్‌కు ఇంకా సమయం ఉండడంతో డెలివరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సమయానికి విమానంలో వైద్యులు కూడా లేకపోవడంతో పైలట్‌ తల్లిబిడ్డలను కాపాడే ప్రయత్నం చేశాడు. తన బాధ్యతలను కో-పైలట్‌కు అప్పగించాడు. అనంతరం సెల్‌ఫోన్‌ ద్వారా డాక్టర్లను సంప్రదిస్తూ.. వారి యొక్క సూచనలతో విజయవంతంగా పురుడు పోశాడు. అనంతరం బిడ్డతో దిగిన ఫొటోను పైలట్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బిడ్డకు స్కైబేబీ పేరు పెట్టాలంటూ సూచించాడు.

ఇదిలా ఉంటే పైలట్‌ చర్యను తోటి ప్రయాణికులంతా ప్రశంసించారు. ల్యాండింగ్‌ అనంతరం తల్లిబిడ్డలను వైద్య సిబ్బంది పరీక్షించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లుగా పైలట్‌గా వ్యవహరిస్తున్న జాకరిన్‌ గతంలో ఎప్పుడు ఈ పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపాడు.