Site icon NTV Telugu

Urea: రైతుల యూరియా కష్టాలకు చెక్.. ఆ జిల్లాలకు భారీగా బస్తాలు..

Urea

Urea

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి రైల్వే ర్యాక్ పాయింట్‌కు గురువారం ఉదయం భారీ ఎత్తున 2,636 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది. ఈ నిల్వలను వివిధ జిల్లాలకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి (DAO) ధనసరి పుల్లయ్య వెల్లడించారు. తాజా కేటాయింపుల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు.. 1,136 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు.. 1,000 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 300 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకు 200 మెట్రిక్ టన్నులు కేటాయించారు. రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చిన ఈ ఎరువులను లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఆయా జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS), ప్రైవేటు ఎరువుల దుకాణాలకు తరలిస్తున్నారు.

Also Read:Revanth Reddy : హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే, హాలీవుడ్ ఇక్కడికి వచ్చినట్లే

గత కొద్ది రోజులుగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ యాప్ బుకింగ్ విధానం రైతులకు తలనొప్పిగా మారింది. యాప్‌లో బుక్ చేసుకుందామంటే స్థానిక దుకాణాల్లో నిల్వలు (No Stock) చూపించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Vijay: దళపతి విజయ్ కి మరో షాక్!

ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. గతంలో జిల్లా యూనిట్‌గా ఉన్న బుకింగ్ సౌకర్యాన్ని, ఇప్పుడు మండలం లేదా నియోజకవర్గ స్థాయికి మార్చారు. దీనివల్ల రైతులు తమ సమీప ప్రాంతాల్లో ఎక్కడ యూరియా అందుబాటులో ఉన్నా బుక్ చేసుకునే అవకాశం కలిగింది. అయితే.. క్షేత్రస్థాయిలో నిల్వలు లేకపోవడం వల్ల ఈ వెసులుబాటు కూడా పూర్తిస్థాయిలో ఫలించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఈ భారీ స్టాక్‌తో ఖమ్మం దాని పరిసర జిల్లాల్లో యూరియా కొరత తీరుతుందని అధికారులు భావిస్తున్నారు. యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని.. రైతులు ఆందోళన చెందవద్దని DAO పుల్లయ్య సూచించారు.

Exit mobile version