NTV Telugu Site icon

Revanth Reddy: మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది.. బీఆర్ఎస్, బీజేపీకి రేవంత్ వార్నింగ్..

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నానని.. మీ పతనం మొదలైందని, మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ – బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను సైతం మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని అన్నారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు… ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు… ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇది బీజేపీ – బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయని తెలిపారు. వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?! అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయి? అని మండిపడ్డారు. గడచిన పదేళ్లలో మోడీ – షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కు మన్నది లేదన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్ది… ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయనిత తెలిపారు.

Read also: Heavy Rainfall: కేరళ, తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్ మూసివేయాలని ఆదేశాలు

అమిత్ షా – కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం… ఇదే కదా జరుగుతున్నదన్నారు. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే… వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోందన్నారు. కేసీఆర్ కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవన్నారు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు? అని ఆగ్రహం వ్యక్తం చేశౄరు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై… ఇప్పుడు తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు… కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా?! అని ఆగ్రహం వ్వక్తం చేశారు. పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉందన్నారు. నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా అని తెలిపారు. మీ పతనం మొదలైందని, మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయని తెలిపారు. వివేక్ వెంకట స్వామి కుటుంబంపై దాడి కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడిగా భావిస్తామన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని రేవంత్ అన్నారు.
Star Hospital : ‘డయాబిటిస్’ గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?