తెలంగాణ రాష్ట్రంలో నిన్న పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది. దీంతో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ.. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని, ఉత్తర కుమార ప్రగల్బాలు టీఆర్ఎస్ నేతలు పలికారని ఆయన ఆరోపించారు. దేశానికే దిక్సూచి అని చెప్పారని, రైతులకు 3 గంటలు, 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనధికారికంగా అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చాయని ఆయన మండిపడ్డారు. వీలైనంత వరకు పగటి పూట 9 గంటలు ఇచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు దుబ్బాక, పాలకుర్తిలలో 3 ఫేస్ కరెంట్ లేదని, ప్రభాకర్ రావు సొంత ఊరికి, ఎర్రబెల్లి నియోజకవర్గానికి, నా నియోజకవర్గంలోకి ఎక్కడికైనా వెళ్దామని ఆయన సవాల్ చేశారు. రాష్ట్రంలోని ఏ ఊరికి అయిన వెళ్దాం.. 24 గంటల కరెంట్ ఇస్తున్న ట్లు రైతులు చెబితే నేను ఏ శిక్షకు అయిన సిద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటి వరకు 24 గంటలు ఉచిత కరెంట్ ఎక్కడ ఇచ్చారో చెప్పండని, చెప్పినట్టు వినాలనే రిటైర్డ్ అధికారులను పెట్టుకుంటున్నారన్నారు.
ఎద్దు ఎడ్చిన వ్యవసాయం.. రైతు ఎడ్చిన రాజ్యం.. బాగుపడదని ఆయన హితవు పలికారు. రైతులకు రాత్రి పూట కరెంట్ ఇవ్వాలని, దుబ్బాక ఎన్నికల సందర్భంగా బీజేపీ గెలిస్తే మోటర్లకు మీటర్లు పెడతారని హరీష్ రావు ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు మోటర్లకు మీటర్ లు పెట్టాలని చెప్పారని, మరి మీటర్లు పెట్టాలనే నిర్ణయం ఎవరిది… రాష్ట్ర ప్రభుత్వందా… ఈఆర్సీదా.. అని ఆయన ప్రశ్నించారు.
సిద్దిపేట, సిరిసిల్లకు, గజ్వేల్ లకు ఇస్తున్నట్టు కరెంట్ ను మా నియోజకవర్గానికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణ జలాల విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం… ఈ మధ్యనే ఉప సంహరించుకుంది… టైమ్ వృధా చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజం అవుతుందనేది టీఆర్ఎస్ నేతల ఆలోచన… ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి పునాదులు కదిలిస్తుందో ప్రజలు నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.