NTV Telugu Site icon

Harish Rao: ఊరంతా విషజ్వరాలే.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హరీష్ రావు ఆగ్రహం

Harish Rao

Harish Rao

Harish Rao: రాష్ట్రంలో విషజ్వరాల విజృంభణ, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పడకేసిన పల్లె వైద్యం, మంచమెక్కిన మన్యం, సీజనల్ వ్యాధులతో జనం విలవిల, ఊరంతా విషజ్వరాలే.. అంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లం అన్నారు. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయన్నారు. మలేరియా, డెంగీ, గన్యా వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అన్నారు. జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని అర్థం. పాలన గాడితప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: V. Hanumantha Rao: కంగనా ను కంట్రోల్ చేయండి.. బీజేపీ కి వీహెచ్‌ సూచన..

ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్ తో వణికిపోతున్నరు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డెంగీ కిట్స్ లేక రోగులు ప్రైవేటుకు వెళ్లి అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఇదంతా చూసీ చూడనట్లు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ వ్యవహరిస్తుండటం శోచనీయం అన్నారు. తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ, విషజ్వరాల కేసులను తక్కువ చేసి చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలి. విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలి. విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలి. పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు తెలిపారు.
Kavitha First Tweet: 165 రోజుల విరామం తర్వాత కవిత ట్విట్టర్ పోస్ట్ వైరల్‌..