Jeevanlal Lavidiya : హైదరాబాద్కు చెందిన మాజీ ఆదాయపు పన్ను (ఐటీ) కమిషనర్ జీవన్లాల్ లవిడియా, ఆయన భార్య , సీఐఎస్ఎఫ్ మాజీ డీఐజీ షిప్రా శ్రీవాస్తవపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఇద్దరిపై కేసు నమోదు చేసి సిబిఐ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. 2004 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఆదాయపు పన్ను) అధికారి అయిన జీవన్ లవిడియా గతంలో హైదరాబాద్లో ఐటీ కమిషనర్గా సేవలందించారు.
రూ. 1.11 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు
సిబిఐ తన ఎఫ్ఐఆర్లో 2022 ఏప్రిల్ 1 నుండి 2025 మే 10 వరకు ఉన్న సమయాన్ని ‘చెక్ పీరియడ్’గా పేర్కొంది. ఈ కాలంలో లవిడియా దంపతుల ఆదాయం, వ్యయాలు , ఆస్తులను అధికారులు సమగ్రంగా విశ్లేషించారు. సదరు చెక్ పీరియడ్లో ఈ దంపతుల మొత్తం ఆస్తులు , ఖర్చులు రూ. 3,07,52,247 గా ఉండగా, వారి చట్టబద్ధమైన తెలిసిన ఆదాయ మూలాలు రూ. 1,95,74,358 గా మాత్రమే నమోదయ్యాయి.
దీంతో వీరి వద్ద ఉన్న ఆదాయ వనరులతో పోలిస్తే రూ. 1,11,77,889 లభ్యమైనట్లు సీబీఐ గుర్తించింది. ఇది వారి చట్టబద్ధమైన ఆదాయం కంటే 57.10 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. చెక్ పీరియడ్ ముగిసే సమయానికి జీవన్ లవిడియా కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ. 4,31,60,820 గా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. భర్త అక్రమాస్తులు కూడబెట్టడంలో డీఐజీ హోదాలో ఉన్న భార్య షిప్రా శ్రీవాస్తవ పూర్తి స్థాయిలో సహకరించినట్లు సీబీఐ ఆరోపించింది.
గతంలో లంచం కేసు, ఇళ్లల్లో సోదాలు
జీవన్ లవిడియాపై సీబీఐ కేసు నమోదు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2025 మే 9న ఆయనపై సిబిఐ మరో కేసును నమోదు చేసింది. ఐటీ అసెస్సీలకు అనుకూలంగా అప్పీళ్లను పరిష్కరించేందుకు అక్రమ మార్గాల్లో అనుచిత ప్రయోజనాలు పొందినట్లు అప్పట్లో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసు దర్యాప్తులో భాగంగా 2025 మే 9న లవిడియా, షిప్రా శ్రీవాస్తవ నివాసాలతో పాటు పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు.
ఢిల్లీలోని శ్రీవాస్తవ నివాసంలో జరిపిన సోదాల్లో ఏకంగా రూ. 54 లక్షల నగదుతో పాటు వారి కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భారీ చర, స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దాడుల్లో లభించిన పత్రాలు, డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే, ప్రస్తుతం లవిడియా దంపతులపై ఆదాయానికి మించిన అక్రమాస్తుల నిరోధక చట్టం కింద తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

