నెటిజన్లకు కేంద్రం అదిరిపోయే గిఫ్ట్.. మూడు కొత్త ఇంటర్నెట్ ప్లాన్లు విడుదల! అసలేంటి ‘PM-WANI’..

Pmwani

Pmwani

PM-WANI: దేశంలో డిజిటల్ విప్లవాన్ని మరింత వేగవంతం చేస్తూ.. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) ‘పీఎం వాణి’ (PM-WANI) పథకంలో విప్లవాత్మక మార్పులను ప్రకటించింది. పబ్లిక్ వైఫై వినియోగదారులు ఎదుర్కొంటున్న సుదీర్ఘమైన లాగిన్ పేజీలు, ఓటీపీల నిరీక్షణకు ఈ కొత్త నిర్ణయంతో శాశ్వతంగా చెక్ పడనుంది. ఇకపై కేవలం ఒక్క క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లను నేరుగా హైస్పీడ్ వైఫైకి కనెక్ట్ చేసుకునే సరికొత్త సదుపాయాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

అసలేంటి ఈ ‘పీఎం వాణి’ (PM-WANI)
PM-WANI అంటే ‘ప్రధాన మంత్రి వై-ఫై యాక్సెస్ నెట్‌వర్క్ ఇంటర్‌ఫేస్’. దేశవ్యాప్తంగా సామాన్యులకు సైతం అత్యంత చౌకగా, సులభంగా పబ్లిక్ ఇంటర్నెట్ అందించేందుకు ‘డిజిటల్ ఇండియా’ చొరవలో భాగంగా దీనిని స్టార్ట్ చేశారు. ఖరీదైన మొబైల్ డేటా, బ్రాడ్‌బ్యాండ్‌లతో పనిలేకుండా.. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో ఉచిత లేదా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించడం దీని ముఖ్య ఉద్దేశం. స్థానిక పబ్లిక్ డేటా ఆఫీసులు (PDOs), యాప్ ప్రొవైడర్లు, వైఫై ఆపరేటర్ల సమన్వయంతో ఈ నెట్‌వర్క్ పనిచేస్తుంది.

అప్పటికి ఇప్పటికి ఏమి మారిందంటే..
ఈ సరికొత్త అప్‌డేట్‌లో ప్రధానంగా మూడు కీలక మార్పులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గతంలో ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌ను పబ్లిక్ వైఫైకి కనెక్ట్ చేయాలంటే సుదీర్ఘమైన లాగిన్ ప్రక్రియ, పదేపదే వివరాలు ఎంటర్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. సెకన్ల వ్యవధిలో ల్యాప్‌టాప్ కనెక్ట్ అయిపోతుంది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మాల్స్, కాలేజ్ క్యాంపస్‌లలో కాసేపు మాత్రమే ఇంటర్నెట్ అవసరమయ్యే వారి కోసం 15 నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాల కాలపరిమితితో కూడిన ‘సాచెట్-శైలి’ (Sachet-style) స్వల్పకాలిక ఇంటర్నెట్ ప్లాన్‌లను ప్రభుత్వం తీసుకొచ్చింది.

పబ్లిక్ ప్లేసుల్లో హ్యాకర్లు సృష్టించే నకిలీ వైఫై నెట్‌వర్క్‌ల బారిన పడకుండా యూజర్స్‌ను రక్షించేందుకు టెలికాం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అసలైన, విశ్వసనీయమైన పబ్లిక్ నెట్‌వర్క్‌లను సులభంగా గుర్తించేలా వీటికి ‘PM-WANI’ అధికారిక బ్రాండింగ్‌తో కూడిన పేర్లను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది.

ఈ మార్పులు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే
కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ జారీ చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.. ఈ కొత్త మార్గదర్శకాలను ఎనిమిది వారాలలోగా అమలు చేయాలని పీఎం వాణి భాగస్వామ్య ఆపరేటర్లందరినీ ఆదేశించింది. దీని ప్రకారం, సుమారుగా జూలై 2026 నాటికి దేశవ్యాప్తంగా ఈ సరికొత్త ఫీచర్లు, ప్లాన్లు యూజర్స్‌కు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి.