Flipkart Pay Later: రాబోయే ‘ఫ్రీడమ్ సేల్’ (Freedom Sale)ను దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ‘ఫ్లిప్కార్ట్ పే లేటర్’ (Flipkart Pay Later) పేరుతో ప్రారంభించిన ఈ కొత్త సదుపాయం ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన వస్తువులను వెంటనే కొనుగోలు చేసి, దానికి సంబంధించిన పేమెంట్ను ఆ తర్వాత లేదా సులభమైన ఈఎంఐ (EMI)ల రూపంలో చెల్లించే వెసులుబాటు లభిస్తుంది. ఈ కొత్త సర్వీస్ కోసం ఫ్లిప్కార్ట్ సంస్థ ‘పేయూ ఫైనాన్స్’ (PayU Finance) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సదుపాయం కేవలం ఫ్లిప్కార్ట్లోనే కాకుండా, మైంత్రా (Myntra), ఫ్లిప్కార్ట్ మినిట్స్ (Flipkart Minutes) ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులో ఉంటుంది. కస్టమర్లందరూ ఈ కొత్త సేవను వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు నిత్యవసర గృహోపకరణాల నుంచి ఖరీదైన స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎయిర్ కండిషనర్లు (AC) వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు. కస్టమర్ల సౌకర్యార్థం ‘చెల్లింపుల’ (Repayment) కోసం మూడు రకాల ఎంపికలను ఫ్లిప్కార్ట్ అందిస్తోంది.
మూడు రకాల పేమెంట్ ఆప్షన్లు:
పే లేటర్ (Pay Later): కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు ఎటువంటి అదనపు రుసుము లేకుండా బిల్లు చెల్లించవచ్చు.
పే ఇన్ 3 (Pay in 3): కొనుగోలు చేసిన మొత్తాన్ని మూడు సమాన వాయిదాలుగా (నో-కాస్ట్ రూపంలో) విభజించి చెల్లించవచ్చు.
ఈఎంఐ (EMI): ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు 3 నుంచి 12 నెలల వ్యవధితో సులభ వాయిదాల పద్ధతిని (EMI) ఎంచుకోవచ్చు.
ఈ సదుపాయం తక్కువ ధర వస్తువుల నుండి అధిక ధర కలిగిన అన్ని రకాల కేటగిరీలకు (ఫ్యాషన్, హోమ్, బ్యూటీ, గ్రాసరీ మొదలైనవి) వర్తిస్తుంది. మరోవైపు ఫ్లిప్కార్ట్లో ఆగస్టు 8 నుంచి ప్రతిష్టాత్మక ‘ఫ్రీడమ్ సేల్’ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో ఎస్బీఐ (SBI) కార్డ్లపై 10 శాతం తక్షణ క్యాష్బ్యాక్ లేదా డిస్కౌంట్ లభించనుంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్టాప్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

