భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా బుధవారం (జూన్ 17న) లక్నోలోని ఇటానా స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు అత్యంత కీలకంగా మారింది. ఓపెనర్గా భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న దశాబ్దాల నాటి ఒక ‘మహారికార్డును’ బద్దలు కొట్టే సువర్ణావకాశం ఇప్పుడు హిట్మ్యాన్ ముందుంది.
సెహ్వాగ్ రికార్డుకు 109 పరుగుల దూరంలో..
అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టి20లు) కలిపి ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్గా వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ తన కెరీర్లో ఓపెనర్గా మొత్తం 16,119 పరుగులు సాధించాడు. కాగా, రోహిత్ శర్మ ప్రస్తుతం 16,010 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో 109 పరుగులు చేస్తే, సెహ్వాగ్ను అధిగమించి భారతదేశపు అత్యంత విజయవంతమైన ఓపెనర్గా చరిత్ర పుటల్లోకెక్కుతాడు.
తొలి వన్డేలో నిరాశపరిచిన హిట్మ్యాన్
ధర్మశాలలో జరిగిన మొదటి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించినప్పటికీ, రోహిత్ శర్మ మాత్రం దురదృష్టవశాత్తూ రన్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్తో జరిగిన చిన్న మిస్-అండర్స్టాండింగ్ వల్ల కేవలం 16 పరుగులకే రోహిత్ వెనుతిరగాల్సి వచ్చింది. అయితే ఆ మ్యాచ్లో రోహిత్ మంచి లయలోనే కనిపించడంతో, రెండో వన్డేలో అతడు ఖచ్చితంగా భారీ సెంచరీతో చెలరేగుతాడని అభిమానులు ఆశిస్తున్నారు.
టాప్ ఓపెనర్ల జాబితాలో భారతీయులు..
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్లుగా అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లలో.. వీరేంద్ర సెహ్వాగ్ – 16,119 పరుగులు, రోహిత్ శర్మ – 16,010 పరుగులు, సచిన్ టెండూల్కర్ – 15,335 పరుగులు, సునీల్ గవాస్కర్ – 12,258 పరుగులు, శిఖర్ ధావన్ – 10,867 పరుగులు ఉన్నాయి.జ
సచిన్, గవాస్కర్, ధావన్ వంటి దిగ్గజాల కంటే రోహిత్ ముందే ఉన్నప్పటికీ, ఇప్పుడు సెహ్వాగ్ రికార్డును దాటి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి లక్నో వేదికగా జరగబోయే ఈ రెండో వన్డేనే రోహిత్కు సరైన అవకాశం. హిట్మ్యాన్ తన బ్యాట్తో లక్నోలో ఎలాంటి వినాశనం సృష్టిస్తాడో చూడాలి.

