Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..

Dubai Cricket

Dubai Cricket

ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక టీ20 టోర్నమెంట్ ‘బిగ్ బాష్ లీగ్’ (BBL) చరిత్రలోనే అత్యంత కీలకమైన, అతిపెద్ద మార్పు చోటుచేసుకోబోతోంది. రాబోయే 2026-27 బిగ్ బాష్ లీగ్ సీజన్‌కు ముందు మెల్‌బోర్న్ నగరానికి చెందిన రెండు ప్రముఖ ఫ్రాంచైజీలు మెల్‌బోర్న్ స్టార్స్ మరియు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ఒకే జట్టుగా విలీనం కానున్నాయి. ఈ రెండు జట్లకు మాతృసంస్థగా ఉన్న ‘క్రికెట్ విక్టోరియా’ ఈ సంచలన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా లీగ్‌ను ప్రైవేటీకరించేందుకు ప్రణాళికలు రచిస్తున్న తరుణంలో.. వ్యూహాత్మకంగా ఈ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు.

క్రికెట్ విక్టోరియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ కమిన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఉమ్మడి జట్టుకు కేవలం ‘మెల్‌బోర్న్’ అని పేరు పెట్టనున్నారు. అయితే రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా దీనికి ‘మెల్‌బోర్న్ బుష్రాంజర్స్’ అనే నిక్ నేమ్ పరిశీలనలో ఉంది. ఈ కొత్త సూపర్ టీమ్ తన హోమ్ మ్యాచ్‌లను ప్రపంచ ప్రసిద్ధ, చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆడనుంది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మాజీ జనరల్ మేనేజర్ జేమ్స్ రోసెన్‌గార్టెన్ ఈ విలీన జట్టుకు కూడా జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

×
×
Ad

ఆటగాళ్ల ఎంపిక, ఒప్పందాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇరు జట్లలో ఉన్న ప్రధాన ఆటగాళ్ల జాబితా నుంచి చెరో 10 మంది చొప్పున మొత్తం 20 మంది ఆటగాళ్లు ప్రాథమికంగా ఈ కొత్త జట్టులో భాగస్వాములు అవుతారు. ఈ నూతన జట్టు జెర్సీ విక్టోరియా రాష్ట్ర సాంప్రదాయక రంగు అయిన ‘నేవీ బ్లూ’లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ విలీనానికి ప్రధాన కారణం లీగ్ ప్రైవేటీకరణే. క్రికెట్ విక్టోరియా తన వద్ద ఉన్న రెండు బిగ్ బాష్ లైసెన్సులలో ఒకదానిని పూర్తిగా వదులుకుని, సింగిల్ టీమ్‌గా మారాలని నిర్ణయించింది. మిగిలిన రెండవ ఫ్రాంచైజీ లైసెన్స్‌ను అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారీ ధరకు విక్రయించనున్నారు. తద్వారా భవిష్యత్తులో విదేశీ పెట్టుబడిదారుల ఆధ్వర్యంలో సరికొత్త మెల్‌బోర్న్ జట్టు ఏర్పడి సరికొత్త ‘మెల్‌బోర్న్ డెర్బీ’ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంటుంది. ఈ విలీనంతో లీగ్‌లోని మొత్తం జట్ల సంఖ్య ఎనిమిది నుండి ఏడుకు తగ్గనుంది. గత 15 ఏళ్లుగా విడివిడిగా ఉన్న అభిమాన జట్లు ఒక్కటి కావడంపై అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నప్పటికీ.. వాణిజ్యపరంగా, ఆర్థిక స్థిరత్వం పరంగా ఈ నిర్ణయం లీగ్‌కు ఎంతో మేలు చేస్తుందని బోర్డు భావిస్తోంది.