NTV Telugu Site icon

Pailam Pilaga Review: పైలం పిలగా రివ్యూ

Pailam Pilaga Review

Pailam Pilaga Review

ఈమధ్య కాలంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కథలను కూడా ప్రేక్షకులను బాగా ఆదరిస్తున్నారు. అందుకే అలాంటి కథలను కూడా చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఆ క్రమంలోనే హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘పైలం పిలగా’. సాయి తేజ, పావని కరణం జంటగా నటించిన ఈ సినిమాలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించగా ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించారు. ఇక బాలయ్య ఈ సినిమాని ప్రమోట్ చేయడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి ఈ సినిమాను సెప్టెంబర్ 20న థియేటర్స్ లో విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

పైలం పిలగా కథ:
ఊరిలో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు శివ(సాయి తేజ). ఊరిలో చాలా మందిలానే దుబాయ్ వెళ్లి బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. అయితే ఇదిలా ఉండగానే ఊరిలోనే ఉంటూ ఉన్నదానితో తృప్తి పడాలి అని అనుకునే దేవి(పావని కరణం) అనే అమ్మాయిని శివ ప్రేమిస్తాడు. ఇక దుబాయ్ వెళ్లాలనే శివ కల నెరవేరాలని అంటే రెండు లక్షలు కావాలి. ఆ రెండు లక్షలు కావాలంటే తన నానమ్మ పేరు మీద ఉన్న స్థలం అమ్మితే డబ్బు వస్తుంది, దుబాయ్ వెళ్ళవచ్చని చెబుతుంది. దీంతో శివ తన స్నేహితుడు శ్రీను (ప్రణవ్ సోను) తో కలిసి స్థలం అమ్ముదామని ప్రయత్నించగా స్థలం లిటికేషన్ లో ఉందని తెలుస్తుంది. ఇంతలోనే మరో బంపర్ న్యూస్ కూడా తెలుస్తుంది. మరి ఆ బంపర్ న్యూస్ ఏంటి? దుబాయ్ వెళ్లాలనుకున్న శివ ప్లాన్ ఏమైంది? దేవితో అతని ప్రేమ పెళ్లిపీటలు వరకు వెళ్లిందా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ :
సినిమా కథ గురించి చెప్పాలి అంటే ఇదేం కొత్త కథ కాదు. దుబాయ్ వెళ్లి అయినా కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించాలి అనుకునే కుర్రాడు, కష్టపడినా సుఖంగా సొంత ఊరిలోనే ఉండాలి అనుకునే అమ్మాయిని ప్రేమించడం లాంటి లైన్ తో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే లైన్ లో ఈ సినిమా కూడా తెరకెక్కింది. అయితే అవసరానికి తగ్గట్టు మనిషి ఎలా మారిపోతాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఎలా బిహేవ్ చేస్తాడు? లాంటి విషయాలను ఆయన చాలా ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకి తీసుకు వచ్చారు. డైరెక్టర్ ఆనంద్ గుర్రం రాసుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ.. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో బోర్ కొట్టకుండా సినిమాని నడిపించడంలో దాదాపు సక్సెస్ అయ్యాడు. కామెడీ వేలో సాగుతూనే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలను కళ్ళకు కట్టినట్లు చూపించడంలో కొంత సక్సెస్ అయ్యారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే ‘పిల్ల పిలగాడు’ వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి తేజ హీరోగా, పుష్ప ,పరేషాన్ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన పావని కరణం హీరోయిన్ గా ఇద్దరూ అదరకొట్టారు. హీరో హీరోయిన్లు అనడం కంటే ఏదో మనం రోజువారీ జీవితంలో కనిపించే ఒక జంటలా
దర్శకుడిగా మొదటి సినిమానే అయినప్పటికీ మంచి ప్రతిభ కనబరిచారు. ఇక మిగతా పాత్రధారులు డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వచ్చేసరికి యశ్వంత్ నాగ్ సంగీతం సినిమాకి ప్రధాన బలం అని చెప్పాలి. రామ్ మిరియాల పాడిన పాట బాగా ఆకట్టుకుంది. ఇక సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ కూడా సినిమాని ప్లెజెంట్ ఫీల్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్లీ ‘పైలం పిలగా’ కామెడీ ఎంటర్టైనర్.. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా చూడచ్చు.