ఉత్సాహం ఉరిమింది.. క్రీడా సంద్రంలో యువత తడిసి ముద్దయింది. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి అదరహో అనిపించారు. కళాకారుల సందడి, క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనలతో చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ మరోసారి ఆటల మైదానంలో తనదైన ముద్రను చాటుకుంది. యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి మహోత్సవం శనివారం ఘనంగా ముగిసింది. ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ట్రోఫీలను, రూ.15 లక్షల నగదు బహుమతులను అందజేశారు. ‘జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పం ఉంటే, ఆకాశమే హద్దుగా రాణించవచ్చు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను చాటాలి’ అని 2025 ఏసియన్ చాంపియన్షిప్ గోల్డ్ మెడలిస్ట్, భారత హెప్టార్లెట్ నందిని అగసారా పిలుపునిచ్చారు.
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు నిర్వహించిన 19వ ఎడిషన్ జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ శనివారం అంగరంగ వైభవంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత హెప్టార్లెట్ నందిని అగసారా మాట్లాడుతూ.. క్రీడల్లో ఉంటే చదువు అశ్రద్ధ చేస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. ‘క్రీడాకారులకు క్రమశిక్షణ, సమయ పాలన ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు చదువులో కూడా ఇతరుల కంటే మెరుగ్గా రాణించగలరు. విజ్ఞాన్ విద్యాసంస్థలు చదువుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూనే, ఇలాంటి మహోత్సవాల ద్వారా క్రీడలకు పెద్దపీట వేయడం అభినందనీయం’ అని కొనియాడారు. విద్యార్థులు తమ కెరీర్లో విజయం సాధించడానికి మూడు సూత్రాలను పాటించాలని సూచించారు. అందులో మొదటిది ఏకాగ్రత.. మనం ఏం సాధించాలనుకుంటున్నామో దానిపై స్పష్టమైన లక్ష్యం ఉండాలన్నారు. రెండోది అంకితభావం.. ఎంచుకున్న రంగం పట్ల పూర్తి నిబద్ధతతో పని చేయాలన్నారు. మూడవది కఠిన శ్రమ.. అలుపెరగని కృషితో శ్రమిస్తే ఫలితం దానంతట అదే వస్తుందన్నారు. ‘సాధించాలి అని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే, ఈ మూడు లక్షణాలు మిమ్మల్ని ఖచ్చితంగా విజేతలుగా నిలబెడతాయి’ అని నందిని చెప్పారు. ‘ప్రతి ఒక్కరిలోనూ అపారమైన ప్రతిభ ఉంటుంది. కానీ మనల్ని మనం నమ్ముకున్నప్పుడే ఆ ప్రతిభ బయటకు వస్తుంది. ఓటములు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, మనపై మనం నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. మిమ్మల్ని మీరు నమ్మండి, ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది’ అని విద్యార్థుల్లో ఆమె స్ఫూర్తిని నింపారు.
ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ… ‘విద్యార్థులందరూ ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా, ఎప్పుడూ పాజిటివ్ ఆలోచిస్తూ.. వీలైనంత వరకు పక్క వాళ్లతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. నేనైతే ఇప్పటివరకు నాకు నచ్చిన పనిని మాత్రమే చేస్తున్నా. మీకు ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆ రంగంలోకి వెళ్లిపోండడి. మీకు ఏం కావాలో మీ మనసుకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. మీ మనసు ఏది చెబితే అది ఖచ్చింతంగా వినండి, ఎవ్వరి మాట అస్సలు వినొద్దు’ అని విద్యార్థులకు సూచించారు.
విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ… ‘క్రీడల్లో ఓటమి అనేది అంతం కాదు, అది మన బలహీనతలను గుర్తించి, బలంగా ఎదిగేందుకు లభించే గొప్ప అవకాశం. ప్రతి అపజయం ఒక విజయం లాంటిదే. ఎందుకంటే అది మనల్ని రేపటి గెలుపుకు సిద్ధం చేస్తుంది’ అని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హెప్టార్లెట్ నందిని అగసారా ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నందిని మన దేశానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆమె సాధించిన విజయాలు మీ అందరికీ స్ఫూర్తినివ్వాలి’ అని పేర్కొన్నారు. చదువులో రాణించే తెలివైన విద్యార్థులు ఒక్కోసారి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని.. కానీ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఎప్పుడూ మానసిక ఉల్లాసంతో ఉంటారని తెలిపారు. మీరు కుంగుబాటుకు లోనైనప్పుడు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం లేదా క్రీడల్లో పాల్గొనడం ద్వారా తిరిగి ఉత్తేజాన్ని పొందవచ్చన్నారు. ఈ వేడుకల్లో సుమారు 20,000 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం విశేషమని, ఈ వేదిక ద్వారా విద్యార్థులు కేవలం ఆటలనే కాకుండా జీవితానికి అవసరమైన ఎన్నో విలువలను నేర్చుకున్నారని వివరించారు:
వర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి మాట్లాడుతూ… ‘విజ్ఞాన్స్ మహోత్సవ్ ద్వారా విద్యార్థులకు నూతన అనుభవం పొందే అవకాశం లభించింది. అంతేకాకుండా లీడర్షిప్ మరియు టీమ్ వర్క్ నేర్చుకోవడం, వివిధ కళా మరియు సాంకేతిక రంగాలలో మెరుగుదల, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కళాశాల విద్యార్థులతో ఇంటరాక్షన్ పెరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నృత్యం, పాటలు, డ్రామా, ఫ్యాషన్ షో లాంటి ప్రదర్శనలు విద్యార్థుల సృజనాత్మకతను వెలుగులోకి వస్తాయి. క్రీడలు – క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, మరియు ఇతర క్రీడలు విద్యార్థులలో స్పోర్ట్స్్మన్షిప్ను పెంపొందిస్తాయి’ అని చెప్పారు.
విజ్ఞాన్ మహోత్సవ్ 2026 విజేతలు:
జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ భాగంగా మొత్తం 80 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు విలువైన నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు. మహోత్సవ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన క్రికెట్ చాంపియన్షిప్లో తిరుపతికి చెందిన మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) జట్టు విజేతగా నిలిచి రూ.50 వేల నగదు బహుమతి సాధించింది. రన్నరప్ విజయవాడకు చెందిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ జట్టు నిలిచింది.
250కు పైగా విద్యాసంస్థల నుంచి విద్యార్థులు:
మహోత్సవ్ పాల్గొనేందుకు పలు రాష్ట్రాలకు చెందిన 250కు పైగా యూనివర్సిటీలు, కళాశాలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. 20 వేల మందికి పైగా విద్యార్థులు ఆయా క్రీడాంశాల్లో పాల్గొన్నారు. సర్టిఫికెట్లు, మెమెంటోలతో పాటు రూ.15 లక్షల విలువైన నగదు బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జాతీయ స్థాయి 19వ ఎడిషన్ “విజ్ఞాన్ మహోత్సవ్-2కే26” గెజిట్ పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, ఇంచార్జి వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.
