తెలంగాణ అటవీశాఖలో కొత్త దూమారం రేగుతోందా? ఓ ఉన్నతాధికారి నిర్ణయాలు మంత్రులకు మింగుడు పడ్డం లేదా? సొంత శాఖ మంత్రి ఆదేశాలను కూడా సదరు ఆఫీసర్ తీసి పక్కన పెట్టేస్తున్నారా? నా దారి…. రూల్ దారి. ఇందులో నో పాలిటిక్స్ అంటున్న ఆ అధికారి ఎవరు? ఆయన నిర్ణయాలతో నొచ్చుకుంటున్న మంత్రులు ఎవరు?
తెలంగాణ అటవీశాఖ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా బాధ్యతలు చేపట్టిన వినయ్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కొందరి దృష్టిలో అవి వివాదాస్పద నిర్ణయాలని కూడా అంటున్నారు. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కీలక నిర్ణయం తీసుకున్నారాయన. గతంలో రాజకీయ సిఫారసులతో జరిగిన డిప్యూటేషన్లను సమీక్షించి వాటిని రద్దు చేయడం ఇప్పుడు సంచలనమైంది. నిబంధనలకే ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శాఖలో చర్చ జరుగుతోంది. గతంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మిగతా మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సిఫారసు లేఖల ఆధారంగా అటవీ శాఖలో కొందరు అధికారులు, ఉద్యోగులకు డిప్యుటేషన్స్ మంజూరైనట్లు సమాచారం.
అయితే వాటన్నిటినీ ఇన్ఛార్జి PCCF వినయ్ కుమార్ పునఃసమీక్షించి రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సిఫార్సుల ఆధారంగా వెళ్లిన అధికారులు తిరిగి తమ అసలు స్థానాలకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఈ నిర్ణయాలతో అసంతృప్తికి గురైన ఉద్యోగులు గతంలో తమకు సిఫారసు చేసిన మంత్రులను ఆశ్రయించినట్లు సమాచారం. తర్వాత పలువురు మంత్రులు వినయ్ కుమార్తో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయిందట. డిప్యుటేషన్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించినా… నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నానని ఆయన స్పష్టంగా చెప్పినట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు… శాఖ వ్యవహారాల్లో ఎలాంటి పైరవీలు ఉండవు… నిబంధనలే ప్రామాణికం అన్నదే తన వైఖరిగా చెప్పినట్టు తెలుస్తోంది. చివరికి అటవీశాఖ మంత్రిగా కొండా సురేఖ ఈ అంశంపై పలుమార్లు స్పందించినా… నిర్ణయాల్లో మార్పు రాకపోవడం ఇప్పుడు డిపార్ట్మెంట్ హాట్ అయింది.
సొంత శాఖ మంత్రి సూచనలకే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయం ఒకవైపు వ్యక్తమవుతోంది. అదే సమయంలో రాజకీయ జోక్యానికి అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి నిర్ణయాలు అవసరమేనని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అటవీశాఖలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా, పరిపాలనా పరంగా చర్చనీయాంశమయ్యాయి. మంత్రుల సిఫార్సుల కంటే నిబంధనలకే ప్రాధాన్యం ఇస్తానన్న వినయ్కుమార్ తన వైఖరిని ఇలాగే కొనసాగిస్తారా? లేక రాజకీయ ఒత్తిళ్లతో పరిస్థితుల్లో మార్పు వస్తుందా? అన్నదే ఇప్పుడు తెలంగాణ అటవీశాఖలో జరుగుతున్న ఆసక్తికర చర్చ.

