Site icon NTV Telugu

Off The Record: వరంగల్ వెస్ట్‌లో తారాస్థాయికి పొలిటికల్ వార్..

Warangal Otr

Warangal Otr

Off The Record: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. కొద్ది రోజుల నుంచి తీవ్రత పెరిగిపోయిన క్రమంలో….తాజాగా అమ్మవారి గుడి ఇందుకు వేదికవడం కలకలం రేపుతోంది. గతంలో భద్రకాళి చెరువు పూడికతీత పనులు జరిగినప్పుడు వీరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం నడిచింది. దానిమీద అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ సైతం స్పందించడం సంచలనమైంది. ఆ వివాదం సద్దుమణిగిందనుకునేలోపే.. భద్రకాళి ఆలయ మాడ వీధుల విస్తరణ పంచాయితీ మొదలైంది. ఈ ప్రముఖ ఆలయ అభివృద్ధిలో భాగంగా…మాడ వీధుల విస్తరణకు నిర్ణయించారు. ఇక్కడే సిట్టింగ్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాడ వీధుల విస్తరణ పేరుతో అక్కడున్న నిరుపేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా గుడిసెలు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే. అయితే… గత ప్రభుత్వ ప్రతిపాదిననే అమలు చేస్తున్నాం తప్ప… ఇందులో కొత్తేమీ లేదని క్లారిటీ ఇస్తున్నారు శాసనసభ్యుడు నాయిని.

దీంతో…. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం రాజకీయం మళ్ళీ రాజుకుంది. ఆలయ అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అధికార పక్షం నేత ఆరోపిస్తుంటే…. పేదలకు న్యాయం చేయకుండా అమ్మవారి చెబితే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. ఈ రాజకీయవైరం సంగతి ఎలా ఉన్నా… అటు అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని ఉన్న చెరబండరాజు నగర్ గుడిసె వాసులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. భద్రకాళి అమ్మవారి మాడవీధుల విస్తరణ వివాదం ఇలా సాగుతూ ఉండగానే… మరోవైపు, బీఆర్ఎస్ కార్పొరేటర్ ఒకరు కాంగ్రెస్ కార్యకర్తపై కత్తితో దాడి చేసి గాయపరచడం కలకలం రేపింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ నగరంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారని, ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా ఆయనను నగర బహిష్కరణ చేయాలని కూడా కోరారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు వరంగల్‌లో సంచలనం అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయినిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ వచ్చి కార్పొరేటర్‌ను పరామర్శించడంతో పొలిటికల్ హీట్‌ పెరిగిపోయింది. నగరంలో చేయాల్సిన అభివృద్ధి పనులు వదిలేసి బీఆర్‌ఎస్‌ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్‌. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే…. ఇది ఇక్కడితో తెగేలా కనిపించడం లేదని, తీవ్రత ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పొలిటికల్‌ గేమ్‌కు తావు లేకుండా చెరబండరాజు నగర్‌ గుడిసె వాసులకు న్యాయం చేస్తారా? అలాగే… వివాద రహితంగా అమ్మవారి ఆలయ మాడవీధుల విస్తరణ పూర్తవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version