OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్

  • ధర్మవరం వైసీపీ నేతలకు కేతిరెడ్డి వార్నింగ్‌
  • కౌన్సిలర్‌ సీట్లు వద్దంటే పార్టీకి మీరూ వద్దని హెచ్చరిక
  • ధర్మవరం టీడీపీ, బీజేపీ వివాదాల్ని క్యాష్‌ చేసుకునే పనిలో మాజీ
  • మున్సిపల్‌ ఛైర్మన్‌ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న టీడీపీ
  • ఆరోపణల్ని నిరూపిస్తే ఏకగ్రీవం చేసుకోవచ్చంటూ కూటమికి సవాల్‌
  • ఏకకాలంలో సొంతోళ్ళకి వార్నింగ్‌, కూటమిని కన్ఫ్యూజ్‌ చేసే ప్లాన్‌
Otr

Otr

OTR: పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అనుభవించి.. కష్ట కాలం వచ్చాక హ్యాండ్ ఇచ్చి.. సైడ్ అవుతామంటే కుదరంటూ వైసీపీ అధినేత జగన్ సొంత నేతలకు గట్టిగానే హెచ్చరికలు పంపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఛాన్స్ ఇవ్వకూడదని, పోటీ పెట్టి తీరాల్సిందేనని ఇన్ఛార్జ్‌లకు గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చారు కూడా. దీంతో… నియోజకవర్గాల్లో ఆ ప్రభావం గట్టిగానే కనిపిస్తోందంటున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లోకల్‌ లీడర్స్‌కు తాజాగా ఇచ్చిన వార్నింగ్‌నే ఉదహరిస్తున్నారు కొందరు. సాధారణంగా ఎప్పుడూ నా రూటే సపరేటు అన్నట్టుండే కేతిరెడ్డి…ఈ విషయంలో కూడా కాస్త డిఫరెంట్‌గా స్పందించారట. పవర్ ఉన్నప్పుడు కింగులు… లేకపోతే డ్యాష్‌లా…? అంటూ ధర్మవరం వైసీపీ లీడర్స్‌ కొందర్ని డైరెక్ట్‌గా ప్రశ్నించినట్టు తెలిసింది. రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీకు కౌన్సిలర్‌ సీటు వద్దనుకుంటే.. మీరు కూడా నాకు వద్దంటూ సొంత పార్టీ నేతలకే ఝలక్‌ ఇచ్చారట. ఇదే ఇప్పుడు లోకల్‌ వైసీపీలో హాట్‌ టాపిక్‌ అయింది.

ఎన్నికల సమయం సమీపిస్తున్నందున మిగిలిన ప్రాంతాల కంటే కాస్త దూకుడుగా, వరుసగా మీటింగ్స్ పెట్టడంతో పాటు తన పాత గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టేశారాయన. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మవరంలో టీడీపీ, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో విబేధాలు నడుస్తున్నాయి. జనసేన కాస్త అటు ఇటుగా ఉన్నా.. వాళ్లు కూడా తమమాటే చెల్లుబాటవ్వాలని అంటున్నారట. ఇలా ఇన్నాళ్ళు అంతర్గతంగా జరుగుతున్న కూటమి పోరు ఇప్పుడు ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే… అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీటు త్యాగం చేసిన టీడీపీ… మున్సిపల్ ఛైర్మన్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్‌ అని అంటోందట. అదే సమయంలో బీజేపీ, జనసేన కూడా ఛైర్మన్‌తో పాటు ఎక్కువ వార్డుల్లో తామే పోటీ చేయాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. ఆ రకంగా సీట్ల సర్దుబాటులో ఎక్కడ చిన్న తేడా కొట్టినా…. కూటమి నేతలు పరస్పరం సహకరించుకునే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్‌ మీదే రాజకీయం మొదలుపెట్టారట కేతిరెడ్డి. దీన్ని క్యాష్ చేసుకునేలా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి కేడర్‌ని డైలమాలో పెట్టేలా పావులు కదపడంతోపాటు తన స్టైల్‌లో పొలిటికల్‌ గేమ్‌ మొదలుపెట్టారాయన.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నేతన్న నేస్తం పథకంలో అక్రమాలు జరిగాయంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నాడు అనర్హులకు లబ్ది చేకూర్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలనే తిరిగి ప్రస్తావిస్తున్న వెంకట్రామిరెడ్డి… ఒకవేళ కూటమి ప్రభుత్వం ఆ అక్రమాలను నిరూపిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం ఎక్కడా పోటీ చేయబోం, అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోనిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. అలా చేయని పక్షంలో…. మేమేంటో చూపిస్తామని కూడా హెచ్చరించారు. ఇలా కూటమి కార్యకర్తల్ని డైలమాలో పడేయడంతో పాటు.. సొంత పార్టీ నేతల్లో కొందరికి ఏకకాలంలో చురకలటించడం ఇప్పుడు ధర్మవరంలో చర్చనీయాంశం అయింది. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు ఎగబడడం కాదు.. అధికారం లేనప్పుడే ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడాలంటూ తాజా మాజీ కౌన్సిలర్ల క్లాస్ పీకారట కేతిరెడ్డి. నాతో స్నేహంగా ఉంటాం.. కానీ పవర్ లేదు కాబట్టి పోటీ చేయబోమంటే కుదరదంటూ కరాఖండిగా తేల్చిచెప్పినట్టు తెలిసింది. మున్సిపల్‌ కౌన్సిలర్‌ టిక్కెట్‌ వద్దనుకునే వారు.. తనకు కూడా వద్దంటూ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇలా… సొంత వాళ్ళని సిద్ధం చేయడం, కూటమి కేడర్‌ని డైలమాలో పెట్టడం లాంటి ప్రోగ్రామ్‌తో గేమ్‌ మొదలుపెట్టారట మాజీ ఎమ్మెల్యే. అధికార పక్షాన్ని ఢీకొట్టే ప్రయత్నాలు ఫైనల్‌గా ఎంతవరకు వర్కౌట్‌ అవుతాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్‌.