X Monetization: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎక్స్ తన మానిటైజేషన్ (ఆదాయం) విధానంలో తాజాగా కీలక మార్పులు చేపట్టింది. క్లిక్బైట్ కంటెంట్, స్పామ్ పోస్టులకు అడ్డుకట్ట వేస్తూ.. కేవలం ఒరిజినల్ కంటెంట్ను సృష్టించే వారికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చేలా కొత్త రూల్స్ను అమల్లోకి తెచ్చింది. ఇకపై ‘X’లో తక్కువ నాణ్యత గల కంటెంట్తో డబ్బు సంపాదించడం కష్టం కానుంది. కేవలం వ్యూస్, లైక్ల కోసం ఇతరుల వీడియోలను లేదా వైరల్ కంటెంట్ను పోస్ట్ చేసే ‘ఎంగేజ్మెంట్ ఫార్మింగ్’పై సంస్థ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్లాట్ఫామ్పై స్పామ్ను తగ్గించి, విలువైన సమాచారాన్ని అందించే క్రియేటర్లను ప్రోత్సహించడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశం అని సమాచారం.
READ ALSO: Asha Bhosle: 10 ఏళ్ల కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..
కొత్త అప్డేట్ ప్రకారం.. ఎవరైతే స్వయంగా ఒరిజినల్ కంటెంట్ను అందిస్తారో, వారికే ఆదాయంలో సింహభాగం దక్కనుంది. ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత నుంచి ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్లను గుర్తించి, వారికి నేరుగా రివార్డులు అందించేలా కొత్త టూల్స్ను సంస్థ సిద్ధం చేస్తోంది. గతంలో పోస్టుల కింద వచ్చే రిప్లై వ్యూస్కు కూడా ఆదాయం లభించేది. కానీ ఇకపై రిప్లైల ద్వారా వచ్చే వ్యూస్ను మానిటైజేషన్ పరిధి నుంచి తొలగించారు. దీనివల్ల అనవసరమైన కామెంట్ల గొడవ తగ్గుతుందని ఎక్స్ భావిస్తోంది.
డబ్బు సంపాదించాలంటే ..
X ప్లాట్ఫామ్లో మానిటైజేషన్ పొందాలనుకునే క్రియేటర్లు ఇకపై ఈ అర్హతలు కలిగి ఉండాలి. కచ్చితంగా X ప్రీమియం లేదా ప్రీమియం ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉండాలి. కనీసం 500 మంది ఫాలోవర్లను కలిగి ఉండాలి. గత మూడు నెలల కాలంలో కనీసం 5 మిలియన్ల ఆర్గానిక్ ఇంప్రెషన్లు సాధించి ఉండాలి. హోమ్ టైమ్లైన్లోని ఆర్గానిక్ వ్యూస్కు, వెరిఫైడ్ యూజర్ల నుంచి వచ్చే వ్యూస్కు ఎక్కువ వెయిటేజీ లభిస్తుంది. స్థానిక ప్రాంతాల నుంచి వచ్చే వ్యూస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రతిపాదనను ఎలాన్ మస్క్ ప్రస్తుతానికి పక్కన పెట్టారని సమాచారం. ఈ కొత్త మార్పుల వల్ల కేవలం కాపీ-పేస్ట్ చేసే వారికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కష్టపడి కొత్త విషయాలను పంచుకునే నిజమైన క్రియేటర్లకు మాత్రం ‘X’ కాసుల వర్షం కురిపించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత
