Womens T20 WorldCup: ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం

1

1

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ వార్తలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మెగా టోర్నీలో ఫిక్సింగ్‌ కోసం ఓ బంగ్లాదేశీ ప్లేయర్‌ను బుకీలు సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించి ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి కంప్లైంట్ చేసినట్లు ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ ఆడియో సంభాషణను బంగ్లాదేశ్‌కు చెందిన మీడియా సంస్థ విడుదల చేసినట్లు తెలిపింది. ఆ ఆడియో సంభాషణ ప్రకారం.. బుకీలకు ఆమెకు మధ్య మరో బంగ్లా ప్లేయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఈ స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: Sharukh: టికెట్ రేట్ తగ్గిస్తూ పఠాన్ మాస్టర్ ప్లాన్… ఒకేసారి రెండు సినిమాలకి చెక్

ఇక ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “మేము ఇప్పటికే ఐసీసీ యాంటీ క‌ర‌ప్షన్‌ వింగ్‌కు ఫిర్యాదు చేశాం. ఐసీసీ దర్యాప్తు చేపడుతుంది. అయితే ఒకవేళ మా క్రికెటర్లను ఫిక్సర్లు సంప్రదిస్తే.. ప్రోటోకాల్‌ ప్రకారం ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఫిర్యాదు చేయాలని మా ప్లేయర్స్‌కు తెలుసు. ఇది బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు సంబంధించిన ఆంశం కాదు. అందుకే మేము ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడాలని అనుకోలేదు. అంతా ఐసీసీ చూసుకుంటుంది” అని ఆయన తెలిపారు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన రెండు ‍మ్యాచ్‌ల్లోనూ బంగ్లాదేశ్‌ ఓటమిపాలైంది.

Also Read: Air India: చరిత్ర సృష్టించనున్న ఎయిరిండియా