విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ వారు మరోసారి తన భక్తజన సందోహాన్ని, వారి అపారమైన భక్తిని చాటుకున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు సమర్పించుకున్న కానుకల లెక్కింపు శనివారం అత్యంత పారదర్శకంగా జరిగింది. గత 17 రోజులకు సంబంధించి (ఏప్రిల్ 15, 2026 నుండి మే 02, 2026 వరకు) హుండీ ఆదాయాన్ని లెక్కించగా, ఆలయానికి కళ్లు చెదిరే స్థాయిలో రూ. 2.83 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఆదాయ వివరాలు ఇలా..
భక్తులు తమ మొక్కుబడులను నగదు, బంగారం, వెండి రూపంలో భారీగా చెల్లించుకున్నారు.
మొత్తం నగదు రూ. 2,83,17,242 కాగా వీటిలో.. నోట్ల రూపంలో రూ. 2,70,22,242, నాణేల రూపంలో: రూ. 12,95,000 వచ్చాయి. రోజుకు సగటు ఆదాయం సుమారు రూ. 16,65,720. కేవలం నగదు మాత్రమే కాకుండా, భక్తులు అమ్మవారికి విలువైన లోహాలను కూడా సమర్పించారు. ఇందులో 329 గ్రాముల బంగారం, 3 కిలోల 800 గ్రాముల వెండి ఆభరణాలు, వస్తువులు ఉన్నాయి. దుర్గమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటిందనడానికి సాక్ష్యంగా హుండీలో భారీగా విదేశీ కరెన్సీ కూడా లభ్యమైంది. ఎన్నారై భక్తులు తమ పర్యటనలో భాగంగా అమ్మవారికి డాలర్లు, రియాల్స్ రూపంలో కానుకలు సమర్పించారు.
అమెరికా డాలర్లు 707, నైజీరియా నైరా 1200, ఇండోనేషియా రూపియా 6500, జపాన్ యెన్ 1000, సౌదీ రియాల్ 231, యూఏఈ దిర్హామ్ 60 నోట్లు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని మహా మంటపంలో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఆలయ అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరగడం వల్లే ఆదాయం ఈ స్థాయిలో వృద్ధి చెందిందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులకు, భక్తుల సౌకర్యార్థం వినియోగించనున్నట్లు దేవస్థానం స్పష్టం చేసింది.
