UP cabinet: యోగి కేబినెట్ విస్తరణ.. నలుగురికి చోటు

Cabinet

Cabinet

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మంగళవారం యోగి మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) జరిగింది. కొత్తగా నలుగురికి చోటు లభించింది. ఉత్తరప్రదేశ్ కేబినెట్‌లో ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్, బీజేపీ నేత దారా సింగ్ చౌహాన్, ఆర్‌ఎల్‌డీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, బీజేపీకి చెందిన సునీల్ కుమార్ శర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారి చేత ప్రమాణం చేయించారు.

ఓం ప్రకాశ్ రాజ్‌భర్ జహురాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. చౌహాన్ బీజేపీ ఎమ్మెల్సీ, కుమార్ పుర్కాజీ నియోజకవర్గం నుంచి మూడోసారి ఆర్‌ఎల్‌డీ ఎమ్మెల్యేగా ఉన్నారు. శర్మ సాహిబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల ముందు కేబినెట్ విస్తరణ జరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ఆర్‌ఎల్‌డీ.. ఎన్డీఏ కూటమిలో చేరింది. అనంతరం కేబినెట్‌లో చోటు దొరకడం విశేషం. జరగబోయే ఎన్నికల్లో బలం పుంజుకోవడం కోసమే కేబినెట్ విస్తరణ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.