UPI Malaysia Launch: భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచ మైలురాయిని సాధించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగం అయిన NIPL మలేషియాలో అధికారికంగా తన సేవలను ప్రారంభించింది. దీంతో UPI సేవలను స్వీకరించిన ప్రపంచంలో తొమ్మిదవ దేశంగా మలేషియా అవతరించింది. ఈ కీలక పరిణామంతో మలేషియాను సందర్శించే లక్షలాది మంది భారతీయ పర్యాటకులకు గణనీయమైన ఉపశమనం, సౌకర్యం లభించనుంది. ఇకపై మలేషియాలో కొనుగోళ్లు చేయడానికి భారతీయులు నగదు లేదా విదేశీ కరెన్సీపై మాత్రమే ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది.
కరెన్సీ ఆందోళనలు తొలగిపోయాయి..
మలేషియాలో ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) తన సేవలను అందిచడానికి ప్రముఖ మలేషియా చెల్లింపు గేట్వే అయిన Razorpay Curlec తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం మొత్తం వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా మలేషియాకు ప్రయాణించే భారతీయ పౌరులు ఇప్పుడు తమకు ఇష్టమైన UPI యాప్లను (Google Pay, PhonePe, Paytm మొదలైనవి) నేరుగా ఆ దేశంలో ఉపయోగించి స్థానిక వ్యాపారులకు చెల్లించగలరు. ఈ ఫీచర్ Razorpay ప్లాట్ఫామ్ ద్వారా కూడా పని చేస్తుంది. పర్యాటకులకు ఇది ఒక విప్లవాత్మక మార్పుగా విశ్లేషకులు చెబుతున్నారు. మలేషియాకు వెళ్లే భారతీయులు ఇకపై పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ (మలేషియా రింగిట్) కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. భారతదేశంలోని టీ దుకాణంలో QR కోడ్ను స్కాన్ చేసినంత సులభంగా ఈ దేశంలో చెల్లింపు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కొత్త వ్యవస్థ భారతీయ పర్యాటకులకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, మలేషియా ఆర్థిక వ్యవస్థ, స్థానిక వ్యాపారాలకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది. భారతీయ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానం మలేషియా. ప్రతి ఏడాది పెద్ద సంఖ్యలో భారతీయులు ఈ దేశాన్ని సందర్శిస్తారు. ఇప్పటి వరకు పర్యాటకులు స్వేచ్ఛగా షాపింగ్ చేయకుండా పరిమిత చెల్లింపు ఎంపికలు నిరోధించాయి. కానీ UPI వినియోగంలోకి రావడంతో మలేషియా వ్యాపారాలు (వ్యాపారులు) భారతీయ కస్టమర్ల నుంచి చెల్లింపులను అంగీకరించడం చాలా సులభం అవుతుంది. దీంతో వారి కస్టమర్ బేస్ను బలోపేతం చేయడమే కాకుండా భారతదేశం నుంచి వచ్చే పర్యాటకుల ఖర్చును కూడా పెంచుతుందని భావిస్తున్నారు. చెల్లింపులు సులభతరం అయినప్పుడు కస్టమర్లు ఎక్కువ ఖర్చు చేయడానికి ఇష్టపడుతారు, ఇది స్థానిక వ్యాపారాలకు నేరుగా ఆదాయాన్ని పెంచుతుంది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్ని దేశాల్లో UPI సేవలు ఉన్నాయంటే..
మలేషియాలో UPI ప్రారంభం భారతదేశం “డిజిటల్ దౌత్యం”, ప్రపంచ చెల్లింపుల రంగంలో ఇండియాకు పెరుగుతున్న సాంకేతిక ఆధిపత్యానికి స్పష్టమైన చిహ్నంగా విశ్లేషకులు చెబుతున్నారు. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) ఈ స్వదేశీ సాంకేతికతను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లే లక్ష్యంతో పని చేస్తుంది. ఈ సందర్భంగా NIPL మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రితేష్ శుక్లా మాట్లాడుతూ.. “విదేశాలకు వెళ్లే భారతీయులకు డిజిటల్ చెల్లింపులను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, సజావుగా చేయడానికి UPI ప్రపంచ పరిధిని విస్తరించడంపై మా ముఖ్య దృష్టి ఉంది” అని అన్నారు. యూపీఐ జాబితాలో చేరిన తొమ్మిదవ దేశం మలేషియా. దాదాపు ఒక నెల క్రితం ఖతార్లో కూడా UPI సేవలు ప్రారంభించారు. మలేషియా, ఖతార్లతో పాటు, భారతీయ UPI చెల్లింపు వ్యవస్థ ఆమోదించిన ఇతర ఏడు దేశాలలో ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), మారిషస్, శ్రీలంక, సింగపూర్, భూటాన్, నేపాల్ ఉన్నాయి.
READ ALSO: XPeng Flying Car: కార్లకు రెక్కలు రాబోతున్నాయి.. టెస్లాను బీట్ చేసిన చైనా కంపెనీ!
