Today Business Headlines 03-04-23:
కేంద్ర ప్రభుత్వ రుణాలివీ..
కేంద్ర ప్రభుత్వ అప్పులు దాదాపు 151 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించిన ఈ వివరాలను ఆర్థిక శాఖ లేటెస్ట్గా రిలీజ్ చేసింది. సెప్టెంబర్ క్వార్టర్తో పోల్చితే ఈ రుణాలు 2 పాయింట్ 6 శాతం పెరిగాయి. మొత్తం అప్పుల్లో 28 పాయింట్ రెండు తొమ్మిది శాతం రుణాలను ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంది. మూడో త్రైమాసికంలో సెక్యూరిటీల ద్వారా 3 లక్షల 51 వేల కోట్ల రూపాయలను సేకరించిన కేంద్రం.. గడువు తీరిన 85 వేల 377 పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయల రుణాలను తీర్చేసింది.
సర్కార్కు ఓఎన్జీసీ విరాళం
ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్.. ఓఎన్జీసీ.. ప్రధానమంత్రి సహాయ నిధికి తాజాగా వంద కోట్ల రూపాయలను విరాళంగా అందజేసింది. ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు చేయూతగా ఈ నిధులను ఇచ్చింది. ఈ విషయాన్ని భారత్ పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్పూరి వెల్లడించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం సహాయనిధి పేరుతో ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటుచేయగా ఓఎన్జీసీ తొలిసారిగా మూడేళ్ల కిందట 300 కోట్ల రూపాయలను అందజేసింది. రెండో విడతలో.. 70 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది.
ఇక.. ఆధార్, పాన్ తప్పనిసరి
ప్రజా భవిష్య నిధి, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం, పోస్టాఫీసు సేవింగ్ స్కీం వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు ఇకపై ఆధార్ మరియు పర్మనెంట్ అకౌంట్లు నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు సెప్టెంబర్ 30వ తేదీని గడువుగా విధించారు. ఈ పొదుపు పథకాల్లో 50 వేల రూపాయలకు మించి డిపాజిట్ చేసేవారికి పాన్ కార్డ్ కంపల్సరీ. అకౌంట్లను ఓపెన్ చేసిన తర్వాత ఆరు నెలల్లోపు ఐడెంటీ కార్డులను సమర్పించకపోతే ఆయా ఖాతాలను స్తంభింపజేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
సీఎండీగా అదనపు బాధ్యతలు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్.. బీడీఎల్.. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పి.రాధాకృష్ణను నియమించారు. ఈయన ప్రస్తుతం బీడీఎల్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సీఎండీ సిద్ధార్ధ్ మిశ్రా రిటైర్ కావటంతో రాధాకృష్ణకు అదనపు బాధ్యతలను అప్పగించారు. మిస్సైల్స్ ప్రొడక్షన్తోపాటు వివిధ విభాగాల్లో ఈయనకు 35 ఏళ్ల అనుభవం ఉండటం విశేషం. రాధాకృష్ణ.. నాగార్జున యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. జేఎన్టీయూ నుంచి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పూర్తి చేశారు.
రికార్డ్ లెవల్ జీఎస్ట్టీ వసూళ్లు
మార్చి నెలలో లక్షా 60 వేల 122 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. జీఎస్టీ ప్రారంభమయ్యాక ఇది రెండో అత్యధిక కలెక్షన్లు కావటం గమనించాల్సిన అంశం. గతేడాది ఏప్రిల్లో అత్యధికంగా లక్షా 67 వేల 540 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇదిలాఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18 పాయింట్ ఒకటీ సున్నా లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ కింద వసూలయ్యాయి. మరో వైపు.. యూపీఐ లావాదేవీలు మార్చి నెలలో 870 కోట్ల రూపాయల మార్క్ను దాటాయి. తద్వారా లైఫ్టైమ్ హయ్యస్ట్ ట్రాన్సాక్షన్ల వ్యాల్యూ నమోదైంది.
గూగుల్ సంస్థ ఖర్చుల్లో కోత
గూగుల్ సంస్థ తమ ఉద్యోగులకు ఇస్తున్న స్నాక్స్ బంద్ చేసింది. మధ్యాహ్న భోజనాలు, లాండ్రీ సర్వీస్ వంటివాటికి కూడా స్వస్తి చెప్పాలనుకుంటోంది. ఇప్పటికే.. ఆఫీసుల్లోని క్యాంటీన్లను క్లోజ్ చేసింది. దీంతోపాటు కొన్ని ఇతర సదుపాయాలను మరియు ప్రోత్సాహకాలను తగ్గించాలని లేదా నిలిపియాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిక్రూట్మెంట్లలో సైతం కోత పెట్టాలని డిసైడ్ అయింది. ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంది. కంపెనీ డబ్బును అత్యధిక ప్రాధాన్యత కలిగినవాటికే కేటాయించాలని సీఎఫ్ఓ రుత్ పోరట్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.