తెలంగాణ రాష్ట్రంలో పండుగల సందడి మొదలైంది. మార్చి నెలలో వరుసగా వస్తున్న ఉగాది, రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగల మధ్యలో ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఉద్యోగులకు ఊరటనిస్తోంది. జుమాతుల్ వడా (రంజాన్ మాసపు చివరి శుక్రవారం) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మార్చి 20, 2026న ఐచ్ఛిక సెలవు (Optional Holiday) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తేదీ మార్పుకు కారణం…
నిజానికి ఈ సెలవును మొదట మార్చి 13న ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే.. చంద్రదర్శనం, పండుగ కాలాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు, సెలవును మార్చి 20కి మార్చాలని సిఫారసు చేసింది. దీనిని ఆమోదించిన సాధారణ పరిపాలన శాఖ.. అధికారికంగా తేదీని సవరించింది.
ఈ ఏడాది మార్చి నెలాఖరులో తెలుగువారి కొత్త సంవత్సరం ‘ఉగాది’, ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ‘రంజాన్’ దాదాపు వెనువెంటనే రానున్నాయి. ఈ క్రమంలో జుమాతుల్ వడా సెలవు రావడం వల్ల ప్రార్థనలకు, పండుగ ఏర్పాట్లకు తగిన సమయం దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ మతపరమైన ఆచారాల కోసం లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఈ ఐచ్ఛిక సెలవును ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సర్వమత సామరస్యానికి , పండుగల పట్ల ఉన్న గౌరవానికి ప్రతీకగా నిలుస్తోంది.