తెలంగాణలోని ఆయిల్ పామ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ ఆయిల్ ఫెడ్ తీపి కబురు అందించాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆయిల్ పామ్ గెలల ధరను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. మే నెలకు గాను ఆయిల్ పామ్ గెలల ధరను గణనీయంగా పెంచుతూ తెలంగాణ ఆయిల్ ఫెడ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ నెల ధర టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.23,501 కాగా.. టన్నుకు రూ.351 పెరిగింది. పెరిగిన ధరతో కలిపి ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.23,852 కు చేరుకుంది.
రైతులకు ఆర్థిక భరోసా..
గత కొద్ది రోజులుగా పెట్టుబడి వ్యయం పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ధరల పెంపు పెద్ద ఊరటనిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి పామాయిల్ ధరల్లో వస్తున్న మార్పులు, స్థానికంగా పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఆయిల్ ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఆయిల్ పామ్ గెలలకు అత్యధిక ధర లభిస్తుండటం విశేషం.
సాగు విస్తరణకు ఊతం..
ప్రభుత్వం అందిస్తున్న ఈ మద్దతు ధరల వల్ల రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు వైపు మరింత మంది రైతులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ పామ్ సాగు లాభదాయకంగా మారడంతో, రైతులు దీనిని ఒక సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారు. ప్రస్తుత ధరల పెంపుతో మే నెలలో దిగుబడిని ఫ్యాక్టరీలకు తరలించిన రైతులకు అదనపు లాభాలు చేకూరనున్నాయి. పెరిగిన ధరల ప్రకారం మే నెలలో గెలలు విక్రయించిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా ఈ నగదు జమ అవుతుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయిల్ పామ్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
