Swine Flu H1N1 in India: కరోనా ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది.. మళ్లీ ఆ పరిస్థితులను తలచుకుంటేనే అందరికీ వణుకుపుడుతుంది.. అయితే, ఇప్పుడు H1N1 కొత్త వేరియంట్ అంటూ ప్రచారం సాగుతోంది.. దేశంలోని పలు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కర్ణాటక, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో H1N1 కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్వైన్ ఫ్లూ కూడా కరోనా వైరస్లా వేగంగా వ్యాపిస్తుందా? H1N1 కూడా కోవిడ్-19 స్థాయిలో ప్రమాదకరమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలో H1N1 వైరస్కు సంబంధించి కొత్త రకం కనుగొనబడలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత వ్యాక్సిన్లో ఉన్న వైరస్ రకాలతో ప్రస్తుతం వ్యాపిస్తున్న రకం సరిపోలుతుందని, కాబట్టి కరోనా తరహా పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడానికి ఆధారాలు లేవని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
స్వైన్ ఫ్లూ, కరోనా మధ్య పోలిక ఏమిటి?
స్వైన్ ఫ్లూ, కరోనా రెండూ వైరస్ల వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులే. ఇవి ప్రధానంగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. జ్వరం, దగ్గు, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు రెండు వ్యాధుల్లోనూ కనిపించవచ్చు. కొంతమందిలో వ్యాధి తీవ్రత పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండు వైరస్లను ఒకే స్థాయిలో చూడటం సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం స్వైన్ ఫ్లూ ప్రత్యేకంగా ప్రమాదకరమైన రూపంలో వ్యాపిస్తున్నట్లు ఆధారాలు లేవని పేర్కొంటున్నారు.
కరోనా లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా?
భారతదేశంలో H1N1కు సంబంధించి కొత్త వేరియంట్ గుర్తించలేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ కొత్తది కాదని, ప్రస్తుత ఫ్లూ వ్యాక్సిన్లోని రకాలతో ఇది అనుకూలంగా ఉందని సమాచారం. అందువల్ల స్వైన్ ఫ్లూ కారణంగా మరోసారి కరోనా తరహా భారీ పరిస్థితి ఏర్పడుతుందని భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వైరస్ వ్యాప్తిని తేలికగా తీసుకోకుండా జాగ్రత్తలు పాటించడం అవసరమని చెబుతున్నారు.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
స్వైన్ ఫ్లూ సోకిన చాలామంది రోగులు చికిత్సతో కోలుకుంటారు. అయితే అధిక జ్వరం, తీవ్రమైన ఒళ్లునొప్పులు, నిరంతర దగ్గు వంటి లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఫ్లూ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
ప్రభుత్వాలు అప్రమత్తం
స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఆసుపత్రుల్లో ఐసోలేషన్, అవసరమైన పడకలు, మందులు సిద్ధంగా ఉంచాలని సూచనలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే కేసులపై నిఘాను పెంచడంతో పాటు నమూనాలను పరీక్షించేందుకు ఎయిమ్స్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) వంటి ప్రధాన సంస్థల ప్రయోగశాలలను వినియోగిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు కనిపించిన వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య శాఖలు సూచిస్తున్నాయి. మొత్తంగా, దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం H1N1 కొత్త వేరియంట్ కారణంగా కరోనా తరహా పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

