NTV Telugu Site icon

Supreme Court: చంద్రబాబుపై సీఐడీ పిటిషన్‌.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Supreme Court: ఏపీ స్కిల్‌ కేసులో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ సాగింది.. అయితే, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.. ప్రభుత్వం తరపు న్యాయవాది మారినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు.. ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున.. విచారణ వాయిదా వేయాలని కోరారు న్యాయవాదులు.. రెండు వారాలు వాయిదా వేయాలని.. తర్వాత విచారణ చేపట్టాలని కోరారు చంద్రబాబు తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా. ఇక, లూథ్రా విజ్ఞప్తితో తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం. కాగా, గత ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్‌ వ్యవహారంలో చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది.. ఆ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు.. 50 రోజులకు పైగా జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌.. కొన్ని రోజుల తర్వాత పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. దీంతో.. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. ఏపీ సీఐడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

Read Also: Nizam College: అబిడ్స్ లో ఉద్రిక్తత.. విద్యార్థుల ఆందోళనతో భారీ ట్రాఫిక్‌ జామ్‌