విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేష్ కోసం సిట్ గాలింపును ముమ్మరం చేసింది. సాయికృష్ణ మృతదేహం అదృశ్యం వ్యవహారంలో సురేష్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించినట్లు సమాచారం. సీఐ నాగరాజుతో సురేష్కు ఉన్న సంబంధాలు, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అతని పాత్ర, కేసు నమోదుకు ముందే జరిగిన సంప్రదింపులపై సిట్ దృష్టి సారించింది.
ప్రస్తుతం సురేష్ స్వస్థలం శ్రీకాకుళంలోనూ ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టింది. సురేష్ పట్టుబడితే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. విజయవాడలో ఏజీఎస్ ఇన్స్పెక్టర్గా నాగరాజ్ పనిచేసినప్పటి నుంచి అతనితో సురేష్ కు సంబంధాలు ఉన్నాయని సిట్ గుర్తించింది. ఇప్పటికే సురేష్ కుటుంబ సభ్యులను విచారించగా ఏ సమాచారం తెలియదని చెప్పటంతో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ మిస్టరీ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు.

