Yashasvi Jaiswal: పృథ్వీ షా ఏమయ్యాడో గుర్తున్నాడుగా.. యశస్వి జైస్వాల్‌కు మాజీ క్రికెటర్‌ హెచ్చరిక!

  • 2023లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్‌
  • భారత జట్టులో స్థానం కోల్పోయిన యశస్వి
  • జైస్వాల్‌కు పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ హెచ్చరిక
Yashasvi Jaiswal

Yashasvi Jaiswal

టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. 2023లో అద్భుత ఆటతో అదరగొట్టిన జైస్వాల్‌.. ప్రస్తుతం పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ 2025లో విఫలమైన అతడు.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపిక చేసిన భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్‌ 2025లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకేసారి హాఫ్ సెంచరీ (67) బాదాడు. ఈ నేపథ్యంలో జైస్వాల్‌కు పృథ్వీ షాను ఉదాహరణగా చూపుతూ.. పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ బాసిత్‌ అలీ ఓ హెచ్చరిక చేశాడు.

బాసిత్‌ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘యశస్వి జైస్వాల్‌ క్రికెట్‌ మీద ఫోకస్‌ చేయడం లేదు. ఇలానే కొనసాగితే బాధపడాల్సి వస్తుంది. పృథ్వీ షానే దీనికి మంచి ఉదాహరణ. పరిస్థితి చేయి దాటకముందే క్రికెట్‌ను ప్రేమించు, తిరిగి ఫామ్‌ అందుకో’ అని హెచ్చరిక లాంటి సూచన చేశాడు. ఐపీఎల్, దేశవాళీల్లో సత్తాచాటిన పృథ్వీ షా.. వేగంగా భారత జట్టులోకి వచ్చాడు. ఎంత వేగంగా వచ్చాడో.. అంతే తొందరగా జట్టులో స్థానం కోల్పోయాడు. కేవలం భారత జట్టులో మాత్రమే కాదు.. ఐపీఎల్‌లో కూడా ఆడడం లేదు. గత వేలంలో అతడిని ఏ జట్టూ కొనలేదు.

Also Read: RCB vs DC: అదరగొడుతున్న ఆర్‌సీబీ.. డీసీ జైత్రయాత్ర! ఈరోజు గెలుపెవరిది?

రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 రిటైర్‌మెంట్‌ గురించి బాసిత్‌ అలీ స్పందించాడు. ‘టీ20 ప్రపంచకప్‌ 2024ను భారత్‌ గెలిచిన తర్వాత కోహ్లీ, రోహిత్‌లు ఈ ఫార్మాట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇది చాలా మంచి నిర్ణయం. భారత్‌లో టాలెంట్‌ ఉన్న యువ క్రీడాకారులు ఎందరో ఉన్నారు. వారు ఈ ఇద్దరినీ భర్తీ చేస్తారు. అయితే కోహ్లీ అంత తొందరగా టీ20ల నుంచి రిటైర్‌ అవుతాడని నేను అనుకోలేదు’ అని బాసిత్‌ అలీ పేర్కొన్నాడు.