Quad Meeting: భారత్ అధ్యక్షతన నిర్వహించిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశంలో మార్కో రూబియో, S. జైశంకర్, పెన్నీ వాంగ్, తోషిమిట్సు మోటేగి పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, సరఫరా వ్యవస్థలు, కీలక ఖనిజాలు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
సమావేశ ప్రారంభంలో మాట్లాడిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) క్వాడ్ ఇప్పుడు కేవలం చర్చల వేదిక మాత్రమే కాకుండా.. ప్రపంచ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే వేదికగా మారుతోందని పేర్కొన్నారు. తాను విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని నిమిషాల్లోనే తొలి సమావేశం క్వాడ్ తోనే జరిగిందని అన్నారు. అది ఈ కూటమిపై అమెరికా కట్టుబాటును చూపిస్తోందన్నారు. గత ఏడాది కాలంగా క్వాడ్ను సమస్యలపై మాట్లాడే వేదిక నుంచి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రస్తుతం మానవతా సహాయం, ఇంధన భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛ, కీలక ఖనిజాల సరఫరా, సరఫరా వ్యవస్థల విస్తరణ వంటి అంశాల్లో నాలుగు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో క్వాడ్ దేశాల సహకారం మరింత ప్రాధాన్యం సంతరించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగు దేశాలకు ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉన్నాయని, వాటిని సమిష్టిగా ఉపయోగిస్తే ప్రపంచంలోని కీలక సమస్యలను సమర్థంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.
సమావేశంలో భారత విదేశాంగ మంత్రి S. జైశంకర్ (Jaishankar) మాట్లాడుతూ.. క్వాడ్ ప్రధాన దృష్టి ఇండో-పసిఫిక్ ప్రాంతంపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థల స్థిరత్వం, కనెక్టివిటీ సమస్యలు, తయారీ రంగ కేంద్రీకరణ, కీలక మౌలిక సదుపాయాల లోపాలు వంటి అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, విశ్వసనీయ భాగస్వామ్యాలను పెంపొందించడం అవసరమని జైశంకర్ పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా సముద్ర భద్రత, కీలక సాంకేతికతలు, ఆర్థిక స్థిరత్వం, మానవతా సహాయం వంటి రంగాల్లో క్వాడ్ దేశాలు మంచి పురోగతి సాధించాయని తెలిపారు.
భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలతో ఏర్పడిన క్వాడ్ కూటమి ప్రస్తుతం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వానికి కీలక వేదికగా ఎదిగింది. ప్రస్తుతం ఈ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రభావాలు, ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతా పరిస్థితులు, ఖనిజాలు, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంచే మార్గాలు ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా నిలిచాయి. గత ఏడాది వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశం జరిగింది.
#WATCH | India-Australia- Japan-US Quad Foreign Ministers meet in Delhi
(video source: DD) pic.twitter.com/sOo2sEuQR0
— ANI (@ANI) May 26, 2026
