Paralympics 2024: భారత్‌ ఖాతాలోకి అనూహ్యంగా గోల్డ్ మెడల్.. నవదీప్‌ అరుదైన ఘనత!

  • అనూహ్యంగా గోల్డ్ మెడల్
  • నవదీప్‌ సింగ్ ఖాతాలోకి స్వర్ణం
  • 29కి చేరిన భార‌త్ ప‌త‌కాల సంఖ్య
Navdeep Singh

Navdeep Singh

Here Is the reason for Sadegh’s disqualification in Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌ 2024లో భారత్‌ ఖాతాలోకి అనూహ్యంగా గోల్డ్ మెడల్ చేరింది. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ త్రో ఎఫ్41 ఫైనల్లో ఇరాన్ అథ్లెట్ సదేగ్ బీత్ సయా స్వర్ణం గెలుచుకున్నాడు. రెండో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్‌ నవదీప్‌ సింగ్ సిల్వర్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు. అయితే అనూహ్యంగా ఇరాన్‌ అథ్లెట్‌ సదేగ్‌పై అనర్హత వేటు పడడంతో.. గోల్డ్ మెడల్ నవదీప్‌ సొంతమైంది. దీంతో జావెలిన్‌ త్రో ఎఫ్‌-41లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్‌గా నవదీప్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు.

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ చివరి రౌండ్ ఐదో ప్రయత్నంలో సదేగ్ బీత్ 47.64 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ప్రపంచ పారా అథ్లెటిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ (కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ఎథిక్స్) నియమం 8.1ని ఉల్లంఘించిన కారణంగా ఇరాన్ జావెలిన్ త్రోయర్ సదేగ్‌పై అనర్హత వేటు పడింది. పారిస్ పారాలింపిక్స్ కమిటీ సదేగ్ అనర్హతకు గల కారణాన్ని వెల్లడించలేదు. అయితే పోటీ సమయంలో ఎరుపు రంగులో అరబిక్ టెక్స్ట్‌తో కూడిన నల్ల జెండాను ప్రదర్శించిన కారణంగా అతడిపై వేటు పడిందని తెలుస్తోంది.

Also Read: US Open 2024: యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌ అరీనా సబలెంక!

అంతకుముందు మ‌హిళ‌ల 200 మీట‌ర్ల టీ12లో సిమ్రాన్ శ‌ర్మ‌కు కాంస్యం ద‌క్కింది. 24.75 సెకండ్ల‌లో సిమ్రాన్ ల‌క్ష్యాన్ని చేరుకుంది. దీంతో భార‌త్ ప‌త‌కాల సంఖ్య 29కి చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ ఖాతాలో 7 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో ఇదే రికార్డు పతకాలు అన్న విషయం తెలిసిందే. టోక్యోలో అత్యధికంగా 19 పతకాలు భారత్ గెలుచుకుంది.