Off The Record: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు ఎక్కువ. అందుకే ఏ పార్టీ అయినా ఈ సీటు మైనారిటీలకే కేటాయిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 2014, 2019లో పొగాకు వ్యాపారి ముస్తఫాకు ఇచ్చింది వైసీపీ. రెండు సార్లూ విజయం సాధించారాయన. అయితే… 2024లో తన రాజకీయ వారసత్వాన్ని కూతురు నూరి ఫాతిమాకు ఇచ్చారు ముస్తఫా. ఆ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్యే కుమార్తె. ఇక అప్పటి నుంచి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్గా కొనసాగుతున్నారామె. దీనికితోడు ఏడాది క్రితం గుంటూరు నగర పార్టీ అధ్యక్షురాలి పదవి కూడా దక్కింది. అదంతా ఒక ఎత్తయితే…. కొన్నాళ్లుగా నూరి ఫాతిమాకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ తగులుతోంది. వైసీపీ నుంచి గెలిచిన కొంతమంది కార్పొరేటర్లు, నాయకులకు ఆమెకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. స్థానిక నేతలను కలుపుకోకుండా ఇన్ఛార్జ్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ అప్పట్లో సొంతపార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
దీంతో వైసీపీ పెద్దలు నూరి ఫాతిమాను పిలిచి క్లాస్ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని పెద్దోళ్ళు చెప్పినా… ఆమె వైఖరిలో మాత్రం మార్పు రాలేదట. గుంటూరు తూర్పు పరిధిలో వైసీపీ డివిజన్ అధ్యక్షుల ఎంపికలో కూడా కార్పొరేటర్లు, పార్టీలోని సీనియర్ నేతల సూచలను పరిగణలోకి తీసుకోకుండా, అసలు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా పంపకాలు చేశారంటూ అసంతృప్తి రేగింది. ఈ వ్యవహారాన్ని అంతా కలిసి అనేకసార్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇక తాజాగా గుంటూరులో వైసీపీ ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లప్పుడు నూరి ఫాతిమా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నందున పార్టీ తరపున ఇఫ్తార్ విందును ఇక్కడే ఇవ్వాలని నిర్ణయించింది వైసీపీ అధిష్టానం. అందుకు అవసరమైన ఏర్పాట్లు, సదుపాయాల పరిశీలన కోసం సీనియర్ లీడర్స్ అంజాద్ బాషా, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ రహుల్లా, మఖ్బూల్ గుంటూరులోని ఓ కన్వెన్షన్ హాల్ దగ్గరికి వచ్చారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న నూరి ఫాతిమా.. అధిష్టానం దూతలుగా వచ్చిన సీనియర్స్ని పట్టించులేదు. పైగా, అలా చేయండి, ఇలా చేయండంటూ వాళ్లకే సూచనలు చేశారట. దీంతో పెద్దలు బాగా హర్ట్ అయిపోయారు. మనం పార్టీలో సీనియర్స్…….. ఈమె నిన్నగాక మొన్న పాలిటిక్స్లోకి వచ్చారు, ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు, అయినా ఎందుకింత బిల్డప్ అంటూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నట్టు తెలిసింది.
ఇక గుంటూరు నుంచి వైసీపీ సెంట్రల్ ఆఫీసుకు వెళ్లిన మైనార్టీ నేతలు మమ్మల్ని అసలు అక్కడికి ఎందుకు పంపారు? అంతా ఆమెకే అప్పగించొచ్చుకదా…? మాకీ అవమానాలు ఎందుకంటూ ముఖ్య నాయకుల దగ్గర వాపోయినట్టు తెలిసింది. దాంతో… పార్టీ పెద్దలు అసలు ఏం జరిగిందని నేతలను అడిగితే… మేటర్ మొత్తాన్ని పూసగుచ్చినట్టు చెప్పారట. ఆ దెబ్బకే పార్టీ ఇఫ్తార్ విందు గుంటూరు నుంచి విజయవాడకు మారినట్టు తెలిసింది. కేవలం నూరి ఫాతిమా ఓవర్ యాక్షన్ తట్టుకోలేకనే వెన్యూ మార్చాల్సి వచ్చిందన్నది వైసీపీ వర్గాల మాట. ఇక ఇదే సమయంలో స్థానికంగా ఉన్న ఆమె వ్యతిరేకవర్గం కూడా ఒంటెత్తుపోకడపై అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. వైసీపీ మైనార్టీ నేతలు కొంతమంది కూడా నూరి ఫాతిమా తీరుతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఒక్కటవుతున్నట్టు సమాచారం. రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడం, ఎవరి మాట వినకుండా…. నేను చెప్పినట్టే జరగాలన్న వైఖరి కారణంగా సొంత పార్టీలోనే పాతిమా వ్యతిరేక వర్గం పెరిగిపోతోంది. ఈ క్రమంలో అసలు ఇన్ఛార్జ్ పదవి ఉంటుందా? ఊడుతుందా అన్న చర్చ వైసీపీ కేడర్లోనే జరుగుతోంది.
