Site icon NTV Telugu

Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..?

El Nino

El Nino

Mega El Nino: భారత్‌లో ‘‘కరువు’’ పరిస్థితులు రాబోతున్నాయా..?, ‘‘మెగా ఎల్ నినో’’ ఏర్పడబోతోందా? అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి. 1877 తర్వాత అత్యంత శక్తివంతమైన ఎల్ నినో పరిస్థితులు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆ సమయంలో ప్రపంచ జనాభాలో 4 శాతం జనాభాను ఈ ఎల్ నినో బలితీసుకుంది. ఇప్పుడు 2026లో ఇది మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎల్ నినో సహజ వాతావరణ సంఘటన. దీని వల్ల పసిఫిక్ మహా సముద్రంలో జలాలు వేడెక్కుతాయి. దీని వల్ల రుతుపవనాలు ఆ ప్రాంతానికి వెళ్లి వర్షిస్తాయి. దీని వల్ల భారత ఉపఖండంతో పాటు, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో తీవ్ర వర్షాల లోటు ఏర్పడుతుంది. సాధారణంగా ఎల్ నినో ప్రతీ 2-7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. కానీ ఈసారి ఇది మరింత తీవ్రంగా ఉంది. వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. పెరిగిన వేడి, తేమ కారణంగా పాశ్చాత్య దేశాల్లో వడగాలుల ప్రభావం తీవ్ర కావచ్చని, ఇది గత 140 ఏళ్లతో పోలిస్తే తీవ్రంగా ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

మైక్రోనేషయాలో మొదలైన ఒక వేడిగాలి తరంగం ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో 8,046 కిలోమీటర్ల మేర కాలిఫోర్నియా వరకు వ్యాపించి ఉంది. కాలిఫోర్నియా సమీపంలో దీనిని “ది బ్లాబ్” అని పిలుస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ వేడితరంగాలు ఎల్ నినోను మరింత బలపరుస్తోంది. ఇది మొత్తం ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.

1877 తర్వాత, ప్రమాదకరంగా 2026:

1877-78 లో ఏర్పడిన ఎల్ నినో చరిత్రలోనే అత్యంత విధ్వంసమైందిగా పేర్కొంటారు. ఇది వడగాలులు, కరువు, పంట నష్టానికి దారి తీసి, లక్షలాది మంది ప్రాణాలను తీసుకుంది. ఇప్పుడు, 2026లో ఏర్పడబోయే ఎల్ నినో మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మెగా ఎల్ నినో సంభవిస్తే 2027లో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతాయి.

దీని వల్ల ఆస్ట్రేలియా, దక్షిణ, మధ్య ఆఫ్రికా, భారత్, అమెజాన్ వర్షారణ్యాల్లో వర్షాలు తగ్గుతాయి. కరువు, తీవ్రమైన వేడి పెరుగుతుంది. అగ్ని ప్రమాదాల ముప్పు పెరుగుతుంది. మరోవైపు, యూఎస్‌లో ముఖ్యంగా దక్షిణ యూస్‌లో భారీ వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ఉత్తర అమెరికా ప్రాంతంలో మాత్రం వేడి పెరుగుతుంది. ఆసియా, ఆఫ్రికా లోని అనేక దేశాల్లో పంటలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.

భారత్‌పై తీవ్ర ప్రభావం:

ఈ సూపర్ ఎల్ నినో వల్ల రుతుపవనాలపై ఆధారపడిన భారత్ తీవ్రంగా ప్రభావం అవుతుంది. 2026 వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగాయి. ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర భారతదేశంలో ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతాయి. జూన్-సెప్టెంబర్ రుతపవనాలు బలహీనపడవచ్చు, దీనివల్ల కరువు ప్రమాదం పెరుగుతుంది. వాయువ్య భారతదేశంలో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యవసాయం ప్రభావితమవుతుంది . ఈ వేసవిలో అధిక తేమ వల్ల ఉక్కపోత ఉంటుంది. ఒకవేళ ఎల్ నినో అత్యంత తీవ్రరూపం దాల్చితే, దాని ప్రభావం 2027 వరకు కొనసాగుతుంది.

Exit mobile version