IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలంకు మహిళా ఆక్షనీర్‌.. ఇదే మొదటిసారి!

Mallika Sagar

Mallika Sagar

ll you need to know about IPL 2024 Female Auctioneer Mallika Sagar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మినీ వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకా-కోలా అరేనాలో వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు వేలం ఆరంభం కానుంది. ఇది మినీ వేలం కాబట్టి.. ఒకే రోజులో ముగుస్తుంది. భారత్ అవతల జరుగుతున్న తొలి వేలం కూడా ఇదే కావడం విశేషం. ఐపీఎల్ 2024 వేలంను స్టార్ స్పోర్ట్స్, జియా సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మొబైల్ లేదా టీవీలో ఈ వేలాన్ని ఉచితంగా చూడవచ్చు.

ఐపీఎల్ 2024 వేలంను ఓ మహిళా ఆక్షనీర్‌ నిర్వహించనున్నారు. ఆమె పేరు మల్లికా సాగర్‌ అద్వానీ. గత కొన్ని సీజన్లకు ఆక్షనీర్‌గా వ్యవహరించిన హ్యూ ఎడ్మీడ్స్ స్ధానాన్ని మల్లికా భర్తీ చేయనున్నారు. తద్వారా ఐపీఎల్‌లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనీర్‌గా మల్లికా నిలవనున్నారు. ఇటీవల ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంకు మల్లికా ఆక్షనీర్‌గా చేశారు. ప్రో కబడ్డీ లీగ్ వంటి ఇతర క్రీడల కోసం జరిగిన వేలంలో ఆమె భాగమయ్యారు. ప్రస్తుతం మల్లికా సాగర్‌ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఎవరీ మల్లికా సాగర్‌ అని క్రికెట్ ఫాన్స్ వెతుకున్నారు.

మల్లికా సాగర్ ముంబైకి చెందిన ఓ ఆర్ట్‌ కలెక్టర్‌. 48 ఏళ్ల మల్లికాకు వేలంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో తన వాక్‌ చాతుర్యంతో అందరిని అకట్టుకున్నారు. ఆ తర్వాత డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌ (డబ్ల్యూపీఎల్ 2023)కు సంబంధించిన వేలాన్ని మల్లికానే నిర్వహించారు. ఆపై ప్రో కబడ్డీ లీగ్ 2024 వేలం, డబ్ల్యూపీఎల్ 2024 వేలం నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ 2024 వేలంను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు.

Also Read: AUS vs PAK: పాకిస్తాన్‌కు అంత సీన్ లేదు.. ఆస్ట్రేలియాను ఢీకొట్టే సత్తా టీమిండియాకే ఉంది!

ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మావర్ కాలేజ్ నుంచి ఆర్ట్ హిస్టరీలో మల్లికా సాగర్ పట్టా పొందారు. ఆ తర్వాత ఆమె 26 సంవత్సరాల వయస్సులో క్రిస్టీస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. క్రిస్టీస్‌లో వేలం నిర్వహించిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళగా ఆక్షనీర్‌గా మల్లికా నిలిచారు. మోడ్రన్‌ అండ్‌ కాన్‌టెంపరరీ ఇండియన్‌ ఆర్ట్‌ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్‌ కలెక్టర్‌ కన్సల్టెంట్‌గా మల్లికా పని చేస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా 2023 వేలం పాట మధ్యలో హుగ్ ఎడ్మీడెస్‌ తప్పుకోగా.. చారు శర్మ ఆక్షనీర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.