Site icon NTV Telugu

Suspended: పల్లెటూర్లో ఇలా ఎలా చేయాలనిపించింది రా..? పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన కలెక్టర్..

Ps Suspended

Ps Suspended

ప్రభుత్వం అందించే నెలవారీ వేతనాలు సరిపోకనో లేక అడ్డదారిలో సంపాదించాలనే దురాశతోనో తెలియదు కానీ, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల సొమ్మును కాజేయడంలో హద్దులు దాటుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో కీలకమైన పంచాయతీ, రెవెన్యూ శాఖల్లో ఇలాంటి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య ప్రజల కష్టార్జితం, గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను సైతం పక్కదారి పట్టిస్తూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. తాజాగా మహబూబ్ నగర్ జిల్లా వెంగలాయిపల్లిలో పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ ఉదంతం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ప్రజావాణి వేదికగా బాధితులు గొంతెత్తడంతో ఒక అవినీతి తిమింగలం గుట్టు రట్టయింది.

మహబూబ్ నగర్ జిల్లా పాన్‌గల్ మండలం వెంగలాయిపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల గోల్‌మాల్ వ్యవహారం కలకలం రేపింది. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్‌ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని పాన్‌గల్ ఎంపీడీవో గోవిందరావు ధ్రువీకరించారు.

గ్రామ పంచాయతీ నిధులను కార్యదర్శి ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు కొద్దిరోజుల క్రితం ‘ప్రజావాణి’ కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్, విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని (DPO) ఆదేశించారు. డీపీఓ జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

విచారణలో.. గ్రామంలో అసలు వీధి లైట్లు వేయకపోయినా, వేసినట్లు రికార్డుల్లో చూపి నిధులు కాజేసినట్లు తేలింది. ఒకే పనికి రెండుసార్లు బిల్లులు పొంది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. పంచాయతీ ట్రాక్టర్ కోసం నకిలీ ట్రక్ షీట్లు సృష్టించడమే కాకుండా, నకిలీ డీజిల్ బిల్లులు సమర్పించి సొమ్ము చేసుకున్నారు. సర్పంచ్‌లు అందుబాటులో లేని సమయంలో, గ్రామసభ తీర్మానాలు లేకుండానే నిధులను డ్రా చేసినట్లు నిర్ధారణ అయ్యింది.

ప్రజల హర్షం..

తప్పుడు మార్గాల్లో నిధులు మళ్లించిన అధికారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా స్పందించి సస్పెన్షన్ వేటు వేయడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవినీతిని వెలికితీయడంలో కీలక పాత్ర పోషించిన బిల్లా జగన్మోహన్ రెడ్డి, బండి శేఖర్, మల్లెపు పరమేష్, జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, దోసలి బాబు రెడ్డి, లక్ష్మారెడ్డి సంజీవ రెడ్డి తదితరులను గ్రామస్థులు అభినందించారు.

ఇలాంటి అవినీతి అధికారుల వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని, ప్రభుత్వం ఇలాంటి వారిపై మరింత కఠినంగా వ్యవహరించి, నిధులను రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

 

 

Exit mobile version