Maha Chandi Alankaram: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మహా చండీ దేవిగా దర్శనమిస్తూ.. భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శనానికి బారులుతీరారు.. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించినట్టు చెబుతారు.. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అనే పురానాలు చెబుతున్నాయి..
Read Also: Bigg Boss 7 Telugu: గుడ్డు టాస్క్లో భళా అనిపించినా జిలేబి పురం బ్యాచ్..
శ్రీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే నేరవేరుతాయని భక్తుల విశ్వాసం.. శరన్నవరాత్రుల మహోత్సవాల్లో చండీదేవి ప్రాముఖ్యత వేరు. హిందూ పురాణాలు, హిందూ మత విశ్వాసాల ప్రకారం.. రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్లి రాక్షసులు గురించి చెబుతారు. అప్పుడు పరమ శివుడు మాతృ దేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృ దేవతను ఆరాధించారు. అలా మాతృ దేవత అనుగ్రహంతో సరస్వతి దేవి, లక్ష్మీదేవి , మహాకాళి.. చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారని పురాణాలు చెబుతున్నాయి.