Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్‌పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!

E20 Petrol

E20 Petrol

Petrol, Diesel Price: దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.993 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపు 2026 మే 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పెంపుతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ఇతర నగరాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధర ఇప్పుడు రూ.3,000 దాటింది. అయితే, చమురు కంపెనీలు గృహ వినియోగ (14.2 కేజీల) సిలిండర్ల ధరను పెంచకపోవడం ప్రజలకు ఊరటనిచ్చింది. కమర్షియల్ సిలిండ్ ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు సైతం పెరుగుతాయనే వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర క్లారిటీ ఇచ్చేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లీటర్ పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 12.50 పెంచుతూ చమురు శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్న వార్తలను ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్-చెక్ విభాగం ఓ స్పష్టతనిస్తూ, వైరల్ అవుతున్న ఆ ఉత్తర్వు కేవలం ఒక ‘ఫేక్ న్యూస్’ అని తేల్చి చెప్పింది.

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అటువంటి ఉత్తర్వులు ఏవీ జారీ చేయలేదని, ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్న డాక్యుమెంట్ నకిలీదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఈ తప్పుడు వార్త విపరీతంగా ప్రచారం కావడంతో సామాన్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, ప్రజలెవరూ ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని అధికారులు కోరారు. ఇంధన ధరలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా కేవలం అధికారిక మార్గాల ద్వారానే వెల్లడిస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పౌరులు సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు అధికారిక వెబ్‌సైట్లలో సరిచూసుకోవాలని, అనవసరంగా భయాందోళనలకు గురిచేసే ధృవీకరించని పోస్టులను ఫార్వార్డ్ చేయవద్దని పీబీఐ సూచించింది. అనుమానాస్పదంగా అనిపించే పోస్టులను రిపోర్ట్ చేసి తప్పుడు ప్రచారాన్ని అరికట్టడంలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.