Kondagattu Anjanna Temple: నేడు హనుమాన్ జయంతి. కొండగట్టులో ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమాన్ మాల ధారులతో కాషాయ వనంగా కొండగట్టు మారింది. “రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి” నినాదాలతో అంజన్న సన్నిధి మార్మోగుతోంది. మూడు రోజులపాటు జరగనున్న ఉత్సవాల్లో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పవన పుత్రుడి మాలధారులు వచ్చారు. కాలినడకన చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక, మన తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు అంజన్న క్షేత్రం ఎంత విశిష్టమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అనేక మంది ప్రముఖులు సైతం ఆ అంజన్న వల్లే తమకు పునర్జన్మ లభించిందని చెబుతుంటారు. అలాంటి అద్భుత క్షేత్రం గురించి చరిత్ర, ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం…
ఇక ఇక్కడి స్థల పురాణం సైతం అందరినీ అబ్బురపరుస్తోంది. త్రేతా యుగంలో రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. ఇక, హనుమ లక్ష్మణుడిని ఎలాగైనా బతికించాలని సంజీవని తేవడానికి వెళతాడు. హనుమ సంజీవనిని తీసుకొని వచ్చేటప్పుడు మార్గంమధ్యలో పర్వతంలోని ఓ ముక్క విరిగిపడిందట. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశం అయిన ముత్యంపేట గ్రామం వద్ద కొంత భాగము కిందపడిందట. ఆ భాగాన్నే కొండ గట్టుగా ప్రస్తుతం పిలుచుకుంటున్నాం.
పురానాల ప్రకారం.. కొండగట్టు ఆలయ చరిత్ర చాలా విశిష్టమైనది. సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడట. అతడి ఆవుల మందలోని ఓ ఆవు తప్పిపోయిందట. సంజీవుడు ఆ అవును వెతుకుతూ అలసి సేద తీరడానికి ఓ చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడట. అప్పుడు అతడికి ఓ కల వచ్చిందట. ఆ కలలో ఆంజనేయస్వామి సాక్షాత్కరించి తానిక్కడ కోరంద పొదలో ఉన్నానని, తనకు ఎండ, వాన, ముళ్ల నుంచి రక్షణ కల్పించమని చెప్పారట. అంతేకాదు.. ఎప్పటి నుంచో వెతుకుతున్న ఆవు జాడను స్వయంగా హనుమంతుడే సంజీవుని తెలిపి అదృశ్యమయ్యాడట.
వెంటనే నిద్ర నుంచి మేల్కొన్న సంజీవుడు ఉలిక్కిపడి చుట్టూ తన ఆవు కోసం పరిశీలించి చూడగా శ్రీ ఆంజనేయుడు కనిపించాడట. భక్తిభావం నిండిన మనసుతో సంజీవుడు కంటి వెంట కారుతున్న ఆనందాశ్రువులతో స్వామి వారి పాదాలు కడిగి చేతులెత్తి నమస్కరించాడట. అదే సమయంలో దూరం నుంచి ఆవు ‘అంబా’ అంటూ పరిగెత్తుకు వచ్చిందంట. వెంటనే సంజీవుడు చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామి వారు విశ్వరూపం, పంచ ముఖాల్లో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడట. ఆ తర్వాత సంజీవుడు తన సహచరులు, గ్రామస్థుల సహకారంతో హనుమంతుడికి చిన్న ఆలయం నిర్మించారట. ఇలా ఆలయం నిర్మితమైంది. ఇక ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి వెలసి ఉన్నారు.
