Site icon NTV Telugu

Ali Khamenei: ఖమేనీ హత్య వెనుక సౌదీ మాస్టర్ ప్లాన్? ట్రంప్‌ను ఒప్పించింది యువరాజేనా! వాషింగ్టన్ నివేదికలో షాకింగ్ నిజాలు..

Saudi

Saudi

Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అయితే ఈ అత్యున్నత స్థాయి హత్య కేవలం అమెరికా నిర్ణయం మాత్రమేనా? లేక దీని వెనుక బలమైన శక్తుల హస్తం ఉందా? తాజాగా అమెరికన్ మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ వెలువరించిన కథనం ప్రకారం.. ఖమేనీ హత్య వెనుక సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Attack on US consulate in Karachi: ఇరాన్ సుప్రీం లీడర్ మరణం.. కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై దాడి

ఆ 15 నిమిషాల్లో ఏం జరిగిందంటే..
ఖమేనీ తన అత్యంత నమ్మకస్థులైన ఐఆర్‌జీసీ (IRGC) చీఫ్ మొహమ్మద్ పక్‌పూర్, సీనియర్ సలహాదారు అలీ షంఖానీలతో అత్యవసర సమావేశంలో ఉండగా అమెరికా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ పక్కా సమాచారం అమెరికాకు ఎలా అందిందనే దానిపై ఇప్పుడు సౌదీ వైపు వేళ్లు చూపిస్తున్నాయి. వాషింగ్టన్ నివేదికల ప్రకారం, సౌదీ అరేబియా ప్రోద్బలంతోనే అమెరికా ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ పదేపదే అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ చేసి, ఇరాన్‌పై దాడికి ఇదే సరైన సమయమని ఒత్తిడి తెచ్చారు. జనవరి 2026లో సౌదీ రక్షణ మంత్రి ఖలీద్ బిన్ సల్మాన్ రహస్యంగా వైట్ హౌస్‌ను సందర్శించారు. ఈ భేటీలో ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఖమేనీని తొలగించడమే ఏకైక మార్గమని అమెరికా అధికారులను ఒప్పించారు. ఇరాన్ భవిష్యత్తులో మరింత బలపడితే సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు చేసే ప్రమాదం ఉందని, టెహ్రాన్ అణుశక్తిగా మారకముందే దెబ్బకొట్టాలని సౌదీ వాదించిందని వాషింగ్టన్ నివేదికలు వెల్లడించాయి.

సౌదీ – ఇరాన్ శత్రుత్వం..
ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ కేవలం రాజకీయమైంది మాత్రమే కాదు, అది మతపరమైన ఆధిపత్య పోరు కూడా అని విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ అరేబియా సున్నీ ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ షియా ముస్లిం దేశాలకు అండగా ఉంటోంది. యెమెన్, సిరియా, లెబనాన్ దేశాల్లో ఇరాన్ తన ప్రాక్సీల (హుతీలు, హిజ్బుల్లా) ద్వారా సౌదీ ప్రయోజనాలను దెబ్బతీస్తూ వచ్చింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావం పెరిగితే సౌదీ చమురు వాణిజ్యానికి ముప్పు వాటిల్లుతుందని రియాద్ ఎప్పటి నుంచో భయపడుతోంది. 1980ల నాటి ఇరాన్-ఇరాక్ యుద్ధం నుంచి నేటి వరకు ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకవేళ వాషింగ్టన్ నివేదిక నిజమైతే, ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ ఇప్పుడు కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా సౌదీ అరేబియాను కూడా తన ప్రధాన శత్రువుగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది గల్ఫ్ ప్రాంతంలో మరో భారీ యుద్ధానికి దారితీస్తుందా అన్నది వేచి చూడాలని చెబుతున్నారు.

READ ALSO: Crude oil: ముడిచమురు సెగతో స్టాక్ మార్కెట్‌లో వణుకు.. రిలయన్స్, OMC కంపెనీల భవిష్యత్తు ఏంటి?

Exit mobile version