NTV Telugu Site icon

Joginder Sharma: టీ20 వరల్డ్‌కప్ హీరో రిటైర్మెంట్..ఆఖరి మ్యాచ్ ఆడిన 16ఏళ్లకు!

Jo2

Jo2

టీ20 ప్రపంచకప్-2007 హీరో, టీమిండియా వెటరన్ క్రికెటర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని జోగిందర్‌ తన ట్విట్టర్‌లో ప్రత్యేక లేఖ ద్వారా పంచుకున్నాడు. టీమిండియాకు ఆడడం తనకు దక్కిన గౌరవమని.. ఇందుకు సహకరించిన బీసీసీఐ కృతజ్ఞతలని చెప్పాడు. ప్రస్తుతం కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. కాగా, జోగిందర్ రిటైర్మెంట్‌తో 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారత జట్టులో దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ మాత్రమే మిగిలారు. వీరిలో దినేశ్ కార్తీక్ 2022 టీ20 వరల్డ్ కప్‌ ఆడగా.. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు.

Also Read: Ramiz Raja: పాక్ బౌలింగ్‌ను ఇండియా కాపీ కొట్టింది: రమీజ్ రాజా

“ఇంటర్నేషనల్ సహా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నా. 2002 నుంచి 2017 వరకు సాగిన నా క్రికెట్‌ జర్నీలో ఎన్నో ఏళ్లు అద్బుతంగా గడిచాయి. టీమిండియాకు ఆడటం నేను సాధించిన గొప్ప గౌరవం. ఈ అవకాశం కల్పించిన బీసీసీకి కృతజ్ఞతలు. అలాగే ఐసీసీ తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడం నా అదృష్టం. ఆరోజు ధోనీ నన్ను నమ్మి బంతిని చేతిలో పెట్టడం.. ఒత్తిడిలో బౌలింగ్‌ చేసి టీమిండియాను గెలిపించడం ఎప్పటికి మరిచిపోను. ఇక దేశవాలీ క్రికెట్‌లో నాకు సహకరించిన హర్యానా క్రికెట్‌ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. రిటైర్మెంట్‌ తర్వాత ఇష్టపడ్డ క్రికెట్‌లోనే కొనసాగాలనుకుంటున్నా. భిన్నమైన వాతావరణంలో నన్ను నేను సవాలు చేసుకుంటూ ముందుకు కొనసాగుతా. క్రికెటర్‌గా నా ప్రయాణంలో ఇది తదుపరి దశ అనుకుంటున్నా.. నా జీవితంలో కొత్త అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నా” అంటూ జోగిందర్ ట్వీట్ చేశాడు.

Also Read: Bathroom Thief: దొంగతనానికి వచ్చాడు.. ఆపుకోలేక ఎంజాయ్ చేశాడు

హర్యానాలోని రోహ్‌తక్‌ నుంచి వచ్చిన జోగిందర్‌ శర్మ 2004లో బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో నాలుగు వన్డేలు, నాలుగు టీ20లు ఆడిన జోగిందర్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జోగిందర్‌ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం గమనార్హం. అంటే చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన 16 ఏళ్లకు అతడి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఆ ఒక్క ఓవర్‌..

జోగిందర్‌ శర్మ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది 2007 టీ20 ప్రపంచకప్‌. సౌతాఫ్రికా వేదికగా ఐసీసీ ఈ ఫార్మాట్‌లో తొలిసారి మెగాటోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీలో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ధోనీ నేతృత్వంలోని యువ రక్తంతో కూడిన జట్టు అంచనాలకు మించి రాణించి విజేతగా నిలిచింది. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఫైనల్‌ మ్యాచ్‌ జరగడం హైలైట్‌ అనుకుంటే.. నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచ్‌ సాగడం మరో హైలైట్‌. ఇక చివరి ఓవర్‌లో పాక్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. అప్పటికే పాక్‌ బ్యాటర్‌ మిస్బావుల్ హక్‌ క్రీజులో పాతుకుపోయాడు. ఎవరు ఊహించని విధంగా ధోనీ బంతిని జోగిందర్‌ శర్మ చేతికి ఇచ్చాడు. ఏమాత్రం అనుభవం లేని బౌలర్‌కు ఆఖరి ఓవర్‌ను ఇవ్వడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు. తనపై ఉంచిన నమ్మకాన్ని జోగిందర్‌ నిలబెట్టుకున్నాడు. నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో జోగిందర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఆ ఒత్తిడిలోనే జోగిందర్‌ బంతి వేయగా.. మిస్బా స్కూప్‌ షాట్‌ ఆడడం.. ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకోవడంతో పాక్‌ కథ ముగిసింది. అలా టీమిండియా 2007లో నిర్వహించిన తొలి టి20 ప్రపంచకప్‌లో విజేతగా అవతరించింది.