Jeffrey Epstein: అమెరికన్ ఫైనాన్షియర్, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ మరణం వెనుక ఉన్న రహస్యాలు ఇప్పటికీ వీడటం లేదు. 2019 ఆగస్టులో జైలు గదిలోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, అతను చనిపోవడానికి ముందు రాసినట్లుగా భావిస్తున్న ఓ ఆత్మహత్య లేఖ (సూసైడ్ నోట్) గత ఏడేళ్లుగా అత్యంత రహస్యంగా దాచారని, దాన్ని సీల్ చేశారని ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం తాజాగా వెల్లడించింది. ఈ వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 2019 జూలైలో ఎప్స్టీన్ మొదటి సారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన జైలు గదిలో మెడకు గుడ్డ బిగుసుకుని అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఆ సమయంలో అతని సెల్మేట్(తోటి ఖైదీ), మాజీ పోలీస్ అధికారి నికోలస్ టార్టాగ్లియోన్ ఓ గ్రాఫిక్ నవలలో పసుపు రంగు పేపర్ మీద రాసిన సూసైడ్ లేఖను గుర్తించాడు.
అందులో ‘గుడ్ బై చెప్పే సమయం వచ్చింది’ (time to say goodbye) అనే వాక్యం ఉంది. అయితే, టార్టాగ్లియోన్ ఆ నోట్ను జైలు అధికారులకు ఇవ్వకుండా తన లాయర్లకు అప్పగించాడు. ఎప్స్టీన్పై తానే దాడి చేశాడని తప్పుడు ఆరోపణలు చేస్తాడన్న భయంతోనే తాను అలా చేశానని అతను చెప్పుకొచ్చాడు. విచిత్రమేమిటంటే, అప్పట్లో ఎప్స్టీన్ సైతం టార్టాగ్లియోన్ తనపై దాడి చేశాడని అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇక, అప్పట్లో టార్టాగ్లియో కేసును విచారిస్తున్న ఫెడరల్ జడ్జి ఆ లేఖను సీల్ చేయాలని ఆదేశించడంతో అది ఎవరికీ అందుబాటులో లేకుండా పోయింది.
నిజానికి ఇప్పటివరకు ఈ లేఖను అటు అమెరికా న్యాయశాఖ గానీ, ఇటు దర్యాప్తు సంస్థలు గానీ కనీసం కన్నెత్తి చూడలేదు. అసలు అది నిజంగా ఎప్స్టీన్ రాసిందేనా అన్నది తేలాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతులు, ధనవంతులతో ఎప్స్టీన్కు ఉన్న సంబంధాలు, అతను నడిపిన లైంగిక వేధింపుల నెట్వర్క్ గురించిన వేలాది పత్రాలు వెలుగులోకి వస్తున్న ఈ తరుణంలో ఈ లేఖను బహిరంగపరచాలని ‘ది న్యూయార్క్ టైమ్స్’ కోర్టును కోరింది. అప్పట్లో ఎప్స్టీన్ గొంతుపై ఎర్రటి గుర్తులు కనిపించినప్పుడు, తనపై టార్టాగ్లియోనే దాడి చేశాడని ఆరోపించాడు. ఇలాంటి అనేక అనుమానాల మధ్య, ఎప్స్టీన్ చివరి రోజుల్లో అతని మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ లేఖ ఓ కీలక ఆధారంగా మారుతుందని భావిస్తున్నారు.
