Water Supply: హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్.. ఈ ఏరియాల్లోనే..

  • నీటి సరఫరాలో అంతరాయం..
  • రెండు రోజుల పాటు తాగునీరు బంద్..
  • నగరవాసులు సహకరించాలని అధికారుల విజ్ఞప్తి
Water Supply Copy

Water Supply Copy

హైదరాబాద్ వాటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. మంజీరా ఫేజ్-3, పెద్దాపూర్ పంప్ హౌస్‌లో చేపడుతున్న మరమ్మతుల కారణంగా వచ్చే రెండు రోజులు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. పెద్దాపూర్ పంప్ హౌస్‌లో గత 35 ఏళ్లుగా వాడుతున్న పాత హెచ్‌టీ (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి.. వాటి స్థానంలో అత్యాధునిక ప్యానెల్స్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు.. పెద్దాపూర్ నుంచి సింగాపూర్ వరకు ఉన్న 1600 ఎంఎం భారీ పైప్‌లైన్‌లోని ఎయిర్ వాల్వ్‌లను, అలాగే 2000 ఎంఎం పైప్‌లైన్‌లోని ఎయిర్ వెంట్స్‌ను కూడా మారుస్తున్నారు. పంపింగ్ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకే ఈ పనులు చేపట్టినట్లు బోర్డు వివరించింది.

ఈ పనులు మార్చి 7, శనివారం ఉదయం 8 గంటల నుండి మార్చి 8, ఆదివారం రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి. ఈ 36 గంటల పాటు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తారు. మణికొండ, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల మరియు షేక్‌పేట్ పరిధిలోని కాలనీలకు నీటి సౌకర్యం ఉండదు. భోజగుట్ట ప్రాంతంలో మాత్రం చాలా తక్కువ పీడనంతో (లో ప్రెజర్) మాత్రమే నీటిని విడుదల చేస్తారు.

Also Read:Rana Daggubati: కొత్త కంటెంట్ కోసమే నా అన్వేషణ: రానా

పైన పేర్కొన్న ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ముందుగానే నీటిని నిల్వ చేసుకోవాలని వాటర్ బోర్డు అధికారులు సూచించారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే మళ్లీ సాధారణ స్థితికి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా అత్యవసరమైతే స్థానిక జలమండలి కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. నీటి కొరత వల్ల కలిగే అసౌకర్యాన్ని అర్థం చేసుకుని, సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.