హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం రేపింది. మూసాపేట మెట్రో స్టేషన్లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించింది. మెట్రో స్టేషన్లోని సాధారణ స్కానింగ్లో బీప్ శబ్దం రావడంతో.. మెట్రో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికుడి వద్ద బుల్లెట్ ఉండగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి పోలీసులు ప్రయాణికుడిని స్టేషన్కు తరలించి విచారణ చేస్తున్నారు.
Also Read: Protest: కస్టమర్లు రావడం లేదని.. సెలూన్ షాప్ యజమాని వినూత్న నిరసన!
బిహార్కు చెందిన మహమ్మద్ అనే యువకుడు ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నాడు. అక్కడే అతడు ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నాడు. శనివారం రాత్రి మహమ్మద్ ఓ బ్యాగ్తో మూసాపేట మెట్రో స్టేషన్కు వచ్చాడు. సాధారణ స్కానింగ్లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా.. బీప్ శబ్దం వచ్చింది. మహమ్మద్ వద్ద అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 9 ఎంఎం బుల్లెట్ లభించింది. వెంటనే కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
