హుజురాబాద్ లో ప్రచారానికి నేటితో తెర..

వాడివేడిగా సాగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. మరి కొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉండడంతో.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచార వేడి తారస్థాయికి చేరింది. ఈ ఉపఎన్నికలో గెల్చి, మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈటల గెలుపుతో ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే, చాపకింద నీరులా హస్తం పార్టీ ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో.. ఓటర్ను ఆకట్టుకునేందుకు ఆఖరు ప్రయత్నాలు చేస్తున్నారు అభ్యర్థులు. ఈ నెల 30న జరిగే పోలింగ్‌ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హుజురాబాద్‌కు బీజేపీ, ఈటల ఏం చేశారని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. ధరలు పెంచిన బీజేపీ మనకు అవసరమా అని ప్రశ్నించారు. రైతు బంధు, ఆసరా పథకాలు దండగ అన్న వ్యక్తి ఈటల అన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గం సింగాపురంలో హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత, ప్రజాసంగ్రామ యాత్రలో స్పష్టంగా కనిపించిందన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. అధికార పార్టీ డబ్బు,మద్యం పంచినా..గెలిచేది బీజేపీనేనన్నారు.వరేస్తే ఉరే అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను జిల్లా కలెక్టర్ అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు బండి. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నికపై బెట్టింగుల పర్వం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.