Fatima Sana: ఉమెన్స్ ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో పాకిస్తాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా కోసం ఈ మ్యాచ్ చాలా బాధాకరంగా మారింది. జట్టును ఫైనల్కు చేర్చాలని బ్యాట్, బాల్ రెండింటిలోనూ ఆమె తన సర్వస్వాన్ని వెచ్చించింది. కానీ ఆమె ప్రయత్నం చివరికి వ్యర్థంగా మిగిలిపోయింది. సెప్టెంబర్ 11 (శుక్రవారం)న దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో శ్రీలంక పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది.
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ ఫాతిమా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయింది. గ్రౌండ్ లోనే బోరున విలవించడంతో.. సహచరులు ఆమెను ఓదార్చారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 130/6 స్కోరు సాధించింది. మొదట్లనే వరుసగా వికెట్లు కూలడంతో పాకిస్తాన్ ఒత్తిడికి గురైంది. అలాంటి సమయంలో ఫాతిమా సనా కెప్టెన్గా బాధ్యత తీసుకుంది. ఆమె 36 బంతుల్లో అజేయంగా 47 పరుగులు చేసింది. ఆమెకు వేడిలో క్రాంప్స్ సమస్య కూడా ఎదురైంది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. చివరి వరకు క్రీజ్పై నిలబడి టూబా హసన్తో కలిసి చివరి నాలుగు ఓవర్లలో వేగంగా పరుగులు జోడించి జట్టును 130కు చేర్చింది.
ఇక పాకిస్తాన్ ఈ స్కోరును కాపాడటానికి బౌలింగ్కు దిగినప్పుడు కూడా ఫాతిమా మళ్లీ మెరిసింది. తన మొదటి ఓవర్లోనే వరుసగా శ్రీలంక కెప్టెన్ చమారి అటపట్టు, సంజన కవింది వికెట్లు తీసి షాక్ ఇచ్చింది. ఒక దశలో శ్రీలంక 33 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. పాకిస్తాన్ వైపు మ్యాచ్ వెళ్తున్నట్టు కనిపించింది. కానీ హర్షిత సమరవిక్రమ (36 పరుగులు), కవిషా దిల్హారి (33 పరుగులు) 67 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ను తిప్పికొట్టారు. ఫాతిమా మళ్లీ తిరిగి వచ్చి తన మూడో ఓవర్లో ఇద్దరినీ అవుట్ చేసింది. ముందు హర్షితను, తర్వాత కవిషాను ఎల్బీడబ్ల్యూతో అవుట్ చేసి మ్యాచ్లో తన నాలుగో వికెట్ సాధించింది. ఆ తర్వాత కౌషాని నుత్యాంగన (అజేయం 10), నీలాక్షిక సిల్వా (అజేయం 18) బాధ్యత తీసుకున్నారు. నుత్యాంగన ఫాతిమా బంతిపై తన అంతర్జాతీయ కెరీర్లో మొదటి సిక్స్ కొట్టగా, సిల్వా ఫోర్ కొట్టి శ్రీలంకను ఫైనల్కు చేర్చారు.
ఫాతిమా సనా ఈ మ్యాచ్లో 47 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో పాటు 4 వికెట్లు కూడా తీసింది. ఆమెను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపిక చేశారు. కానీ ఈ గౌరవం కూడా జట్టు ఓటమి బాధను తగ్గించలేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫాతిమా తన భావాలను నియంత్రించుకోలేకపోయింది. ఆమె కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. పాకిస్తాన్ను ఫైనల్కు చేర్చాలని అనుకున్న ఆమె ఒంటరి పోరాటం సరిపోలేదు.
ఇక మ్యాచ్ అనంతరం.. శ్రీలంక కెప్టెన్ చమారి అటపట్టు మాట్లాడుతూ.., “బౌలింగ్ యూనిట్గా మేము బాగా ఆడాం. కొన్ని క్యాచ్లు వదిలేశాం కానీ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. హర్షిత, కవిషా ఒత్తిడిని తట్టుకుని సింగిల్స్ బాగా తీశారు. విష్మి, ఇమేషా, కవిషా వంటి మ్యాచ్ విన్నర్లు మా దగ్గర ఉన్నారన్నారు. ఫైనల్లో ప్లాన్లను సరిగా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడించవచ్చని అన్నారు.
అలాగే పాకిస్తాన్ కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. “హర్షిత, కవిషా బాగా ఆడారు. వాళ్లు మ్యాచ్ను దూరం చేశారు. ఫీల్డింగ్లో తప్పులు జరిగాయి. అవి మాకు నష్టం కలిగించాయి. డిఫెండ్ చేయగల స్కోరు ఉన్నా కూడా.. బ్యాటింగ్లో మెరుగుపరుచుకోవాలి” అని అన్నారు.

